

హైదరాబాద్: మౌంట్ మాంగనూయ్ వేదికగా ఆతిథ్య న్యూజిలాండ్తో సోమవారం జరిగిన మూడో వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఐదు వన్డేల సిరిస్ను మరో రెండు వన్డేలు మిగిలుండగానే టీమిండియా 3-0తో కైవసం చేసుకుంది.
ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరింది. జింబాబ్వే, వెస్టిండిస్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లను సొంత గడ్డపై ఓడించి వన్డే సిరిస్ను కైవసం చేసుకున్న తొలి భారత కెప్టెన్గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఇప్పటివరకు కోహ్లీసేన ఇంగ్లాండ్ను ఇంగ్లీషు గడ్డపై వన్డే సిరిస్లో ఓడించలేదు.
63 వన్డేల్లో విరాట్ జట్టుకు నాయకత్వం వహించగా 47 మ్యాచ్ల్లో టీమిండియా విజయం సాధించింది. 63 వన్డేల్లో సారథ్యం వహించిన అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. 50 విజయాలతో క్లైవ్ లాయిడ్, రిక్కీ పాంటింగ్ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. అత్యధిక విజయాల శాతం ఉన్న కెప్టెన్లలో కోహ్లీ (74.60 శాతం) రెండోస్థానంలో నిలిచాడు.
దీంతో పాటు న్యూజిలాండ్ గడ్డపై వరుసగా మూడు వన్డేల్లో విజయం సాధించిన ఆసియా కెప్టెన్ల జాబితాలో విరాట్ కోహ్లీ చోటు దక్కించుకున్నాడు. ఇప్పటివరకు ఈ జాబితాలో పాక్ మాజీ కెప్టెన్ సలీం మాలిక్ ఉండగా... ఇప్పుడు అతడి సరసన విరాట్ కోహ్లీ కూడా చేరాడు. 1981 నుంచి 1999 వరకు పాక్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. సలీం మాలిక్ 34 వన్డేలకు కెప్టెన్గా వ్యవహారించగా అందులో 21 వన్డేల్లో పాక్ జట్టు విజయం సాధించింది.
టీమిండియాకు ఇది వరుసగా ఇది రెండో వన్డే సిరిస్ కావడం విశేషం. ఈ ఏడాది జనవరిలోనే ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించి వన్డే సిరిస్ను 2-1తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా, న్యూజిలాండ్ నిర్దేశించిన 244 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 43 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది.
భారత బ్యాట్స్మెన్లలో రోహిత్ శర్మ (62), విరాట్ కోహ్లీ (60), అంబటి రాయుడు(40), దినేశ్ కార్తీక్(38) రాణించారు. అంతకముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లలో రాస్ టేలర్ (93), టామ్ లాథమ్ (51) రాణించడంతో కివీస్ 49 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ(3/41), భువనేశ్వర్ కుమార్(2/46), హార్డిక్ పాండ్యా(2/45), యజువేంద్ర చాహల్(2/51) విజృంభించారు.