మొహాలి: ఐదు టెస్టుల మ్యాచ్ల సిరిస్లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో శనివారం మూడో టెస్టు ప్రారంభమైంది. ఈ టెస్టు మ్యాచ్లో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు.
విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టు రెండు ఇన్నింగ్స్లు (167, 81) కలిపి కోహ్లీ 248 పరుగులు సాధించాడు. అంతేకాదు రెండో టెస్టు విజయంలో ఈ పరుగులు ఎంతో కీలక పాత్ర పోషించడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు సైతం ఎంపికయ్యాడు. ప్రస్తుతం మొహాలిలో ఆడుతున్న టెస్టు ఈ ఏడాది కోహ్లికి పదోవ టెస్టు.
దీంతో ఈ ఏడాది ఈ క్యాలెండర్ ఇయర్లో అన్ని ఫార్మట్లలో కలిపి విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 84.33 యావరేజితో మొత్తం 2,277 పరుగులు చేశాడు. కోహ్లీ ఈ ఏడాది ఇప్పటి వరకు 9 టెస్టులాడి 69 యావరేజితో 897 పరుగులు చేశాడు. 10 వన్డేలాడి 92.37 యావరేజితో 739 పరుగులు, 15 టీ20లాడి 106.83 యావరేజితో 641 పరుగులు సాధించాడు.

ఇక ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాట్స్మెన్లు రాహుల్ ద్రవిడ్(2,626), సౌరభ్ గంగూలీ (2,580), సచిన్ టెండూల్కర్ (2,541), సెహ్వాగ్(2,355)లను అధిగమించేందుకు కోహ్లీ కొద్ది దూరంలోనే ఉన్నాడు. మొహాలి టెస్టుతో పాటు ఇంకో రెండు టెస్టులు ఉండటం కోహ్లికి కలిసొచ్చే అంశం.
ఈ మూడు టెస్టుల్లో కోహ్లీ రాణిస్తే ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాట్స్ మెన్ల జాబితాలో కోహ్లీ మొదటి స్ధానానికి చేరుకోవడం ఖాయం. ఒక క్యాలెండర్ ఇయర్లో అన్ని ఫార్మట్లలో కలిపి అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాట్స్మెన్ వివరాలిలా ఉన్నాయి.
| ఆటగాళ్లు | మ్యాచ్లు | పరుగులు | అత్యధిక స్కోరు | సగటు | సెంచరీలు | అర్ధసెంచరీలు | సంవత్సరం |
| రాహుల్ ద్రవిడ్ | 53 | 2,626 | 190 | 46.89 | 10 | 9 | 1999 |
| సౌరభ్ గంగూలీ | 51 | 2,580 | 183 | 47.77 | 6 | 17 | 1999 |
| సచిన్ టెండూల్కర్ | 39 | 2,541 | 177 | 68.67 | 12 | 8 | 1998 |
| వీరేంద్ర సెహ్వాగ్ | 33 | 2,355 | 319 | 52.33 | 4 | 14 | 2008 |
| విరాట్ కోహ్లీ | 38 | 2,286 | 169 | 55.75 | 8 | 12 | 2014 |
| విరాట్ కోహ్లీ | 34 | 2,277 | 211 | 84.33 | 6 | 12 | 2016 |