
హైదరాబాద్: దేశ రాజధాని న్యూఢిల్లీ కాలుష్యం కోరల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. వాతావరణ కాలుష్యం, పొగమంచు కారణంగా ఇటీవలే అనేక మంది రోడ్డు ప్రమాదాల బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఢిల్లీ ప్రజలను ఉద్దేశించి ట్విట్టర్లో ఓ వీడియోని పోస్టు చేశాడు.
అందులో ఢిల్లీలో కాలుష్యాన్ని తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చాడు. 'హాయ్, ప్రస్తుతం కాలుష్యం వల్ల ఢిల్లీలో ఎలాంటి పరిస్థితి కొనసాగుతుందో అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నా. కాలుష్యాన్ని తరిమికొట్టేందుకు అందరూ తమ వంతు సాయమందించండి' అని కోహ్లీ పేర్కొన్నాడు.
'కాలుష్యంపై పోరాడి మ్యాచ్ గెలిచేందుకు అందరం కలిసి పనిచేద్దాం. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ముఖ్యంగా ఢిల్లీలో నివాసముంటున్న వారికి. బయటికి ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే మీ రైడ్స్ను షేర్ చేసుకోండి. బస్సు, మెట్రో రైలు, ఓలా క్యాబ్స్ ద్వారా మీ ప్రయాణాన్ని ఇతరులతో షేర్ చేసుకోండి' అని వీడియోలో కోహ్లీ తెలిపాడు.
'వారంలో ఇలా ఒక్కసారి చేసినా ఎంతో మార్పు కనిపిస్తుంది. చిన్న పని ద్వారా మనం ఎంతో మార్పును తీసుకురావచ్చు. ఈ సందేశం మీకు నచ్చినట్లయితే నా పోస్టును లైక్, షేర్ చేసి మీ మద్దతు తెలపండి' అని కోహ్లీ కోరాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.