టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ 2026 కొత్త సంవత్సరానికి అత్యంత మధురంగా స్వాగతం పలికారు. తన సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో కలిసి దిగిన ఓ సరదా ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంటూ తన అభిమానులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఈ ఫోటోలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఇద్దరూ మాస్క్లు ధరించి కనిపించారు. విశేషమేమిటంటే విరాట్ కోహ్లీ ధరించిన మాస్క్ స్పైడర్ మ్యాన్ తరహాలో ఉండటంతో అభిమానులు ఈ ఫోటోను చూసి తెగ ఖుషీ అవుతున్నారు. ముఖంపై మాస్కులు ఉన్నప్పటికీ.. వారి కళ్లలో కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్న సంతోషం స్పష్టంగా కనిపిస్తోంది.
విరాట్ కోహ్లీ తన పోస్ట్లో అనుష్కను ఉద్దేశించి ఇలా రాసుకొచ్చాడు. "నా జీవితపు వెలుగుతో కలిసి 2026వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాను." అని రాశాడు. ఈ సందేశం చూసిన నెటిజన్లు 'కపుల్ గోల్స్' అంటూ కామెంట్లతో సోషల్ మీడియాను నింపేస్తున్నారు.

మైదానంలో కోహ్లీ 'కింగ్' మార్క్ విధ్వంసం
వ్యక్తిగత జీవితంలో కొత్త ఏడాదిని ఎంజాయ్ చేస్తున్న కోహ్లీ.. మైదానంలో కూడా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. దాదాపు 15 ఏళ్ల తర్వాత మళ్లీ విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్న కోహ్లీ, ఢిల్లీ జట్టు తరపున పరుగుల వరద పారిస్తున్నాడు. గత రెండు మ్యాచ్ల్లో కోహ్లీ వరుసగా 131, 77 పరుగులతో అదరగొట్టాడు. ఈ ప్రదర్శనతో లిస్ట్-ఏ క్రికెట్లో కోహ్లీ 16,000 పరుగుల మైలురాయిని కూడా అధిగమించాడు. జనవరి 6న బెంగళూరు వేదికగా రైల్వేస్తో జరిగే మ్యాచ్లో కోహ్లీ తన ఫామ్ను కొనసాగించనున్నాడు. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ (DDCA) అధ్యక్షుడు రోహన్ జైట్లీ కూడా కోహ్లీ తదుపరి మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడని ధ్రువీకరించారు.