
హైదరాబాద్: విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్న సంగతి తెలిసిందే. టీమిండియా ఆటగాళ్లతో పాటు ఫ్యామిలీ సైతం దక్షిణాఫ్రికాకు తీసుకెళ్లేందుకు బోర్డు అనుమతించింది. ఇందులో భాగంగా విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్నారు.
గత కొన్ని రోజులుగా వీరిద్దరూ తొలి టెస్టు మ్యాచ్కి ఆతిథ్యమిస్తోన్న కేప్ టౌన్ పరిసర ప్రాంతాల్లో చక్కర్లు కొడుతున్నారు. అయితే తాజాగా విరుష్క జోడీ బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ను కలిసిన ఫొటో ఒకటి బుధవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అక్షయ్ కుమార్ కూడా సినిమా షూటింగ్ నిమిత్తం దక్షిణాఫ్రికాలోనే ఉన్నాడు. ఇంతకుముందు అక్షయ్ కుమార్తో కలిసి దిగిన ఫొటోను భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి పోస్టు చేసిన సంగతి తెలిసిందే. మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ కోసం కోహ్లీసేన దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోంది.
అక్షయ్ కుమార్ కూడా ప్రస్తుతం కుటుంబసభ్యులతో కలిసి కేప్టౌన్లోనే పర్యటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో విరుష్క జోడీ మంగళవారం అక్షయ్ కుమార్ను కలిసింది. వీరంతా కలిసి లంచ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ముగ్గురూ కలిసున్న ఫోటోను విరాట్ కోహ్లీ అభిమాన సంఘం ఇనిస్టాగ్రామ్లో పోస్టు చేసింది.
ఈ టెస్టు సిరిస్ టీమిండియాకు ఎంతో ప్రత్యేకం కావడంతో గత కొన్ని రోజులుగా భారత ఆటగాళ్లు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. మిగిలిన సమయంలో కేప్టౌన్ వీధుల్లో కుటుంబసభ్యులతో కలిసి సరదాగా గడుపుతున్నారు. మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా జనవరి 5న కేప్టౌన్లో తొలి టెస్టు ప్రారంభంకానుంది. ఇప్పటి వరకు టీమిండియా దక్షిణాఫ్రికాపై ఒక్క టెస్టు సిరీస్ కూడా గెలవలేదు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.