హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు వచ్చేవారం వివాహం చేసుకోబోతున్నట్లు బుధవారం జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. అందుకే శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరిస్ నుంచి కోహ్లీ విశ్రాంతి తీసుకున్నాడని సోషల్ మీడియాలో సైతం ప్రచారం సాగుతోంది.
శ్రీలంకతో డిసెంబర్ 10 నుంచి మూడు వన్డేల సిరిస్ ప్రారంభం కానుంది. వన్డే సిరిస్ అనంతరం డిసెంబర్ 20 నుంచి మూడు టీ20ల సిరిస్ ప్రారంభం కానుంది. ఈ రెండు సిరిస్లకు ప్రకటించిన జట్టులో విరాట్ కోహ్లీకి సెలక్టర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్ నుంచి కోహ్లీ వరుసగా క్రికెట్ ఆడుతున్నాడు.
దీంతో వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే ముందు విశ్రాంతి కావాలని అడగడంతో కోహ్లీకి విశ్రాంతినిచ్చామని బీసీసీఐ సెలక్టర్లు చెబుతున్నారు. అయితే అనుష్క శర్మతో పెళ్లి పెళ్లాడేందుకే సెలవలు తీసుకున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. డిసెంబరు 9, 10, 11, 12 తేదీల్లో ఇటలీలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరుగనున్నట్లు సమాచారం.
పెళ్లి కూతురుగా అనుష్క ధరించే వస్త్రాలను ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ డిజైన్ చేసినట్లు సమాచారం. అనుష్క పబ్లిసిటీ వ్యవహారాలను చూసే బృందం ఈ విషయాలను గోప్యంగా ఉంచుతున్నట్లు సమాచారం. డిసెంబర్ 7న జరగనున్న మ్యాచ్కు విరాట్ కోహ్లి చిన్ననాటి కోచ్, ఢిల్లీ అండర్-23 కోచ్ రాజ్కుమార్ శర్మ హాజరు కావడం లేదు.
కారణం ఏంటని అడగ్గా తన మేనల్లుడి పెళ్లి ఉందని ఆయన చెప్పారట. మరోవైపు పెళ్లి కోసం కోహ్లీ గురువారం అనుష్క శర్మతో కలిసి ఇటలీకి బయలుదేరతాడంటూ జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. కోహ్లీ పెళ్లి కోసం కోహ్లీ కుటుంబసభ్యులు, స్నేహితులు టిక్కెట్లు కూడా బుక్ చేసేసుకున్నారట.
పెళ్లి అనంతరం క్రికెటర్ల కోసం ప్రత్యేకంగా డిసెంబరు 21న ముంబైలో రిసెప్షన్ ఏర్పాటు చేస్తారట. గత ఏడాది డిసెంబర్లోనే తొలిసారిగా వీరి పెళ్లి వార్తలు బయటకు వచ్చాయి.
పెళ్లి వార్తలను ఖండించిన అనుష్క శర్మ అధికార ప్రతినిధి
వచ్చే వారం కోహ్లీతో పెళ్లి అంటూ వచ్చిన వార్తలను అనుష్క శర్మ ఖండించింది. వచ్చే వారంలో అనుష్క, విరాట్ కోహ్లీ పెళ్లి చేసుకుంటున్నట్లు పలు టీవీ ఛానళ్లలో వచ్చిన వార్తలను అనుష్క అధికార ప్రతినిధి కొట్టిపారేశారు. అనుష్క శర్మ పెళ్లి వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ఆయన తేల్చి చెప్పాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.