
హైదరాబాద్: సుదీర్ఘ కాలం ప్రేమాయాణం అనంతరం.. సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకుని ఒక్కటైయ్యారు విరుష్కా జోడి. కెరీర్ల పరంగా దూరంగా ఉంటున్నా.. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో.. సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వెలిబుచ్చుతూనే ఉంటారు. అయితే పెళ్లయిన తర్వాత వీరికి కలిసి గడిపేందుకు పెద్దగా సమయం దొరకడం లేదట.
అనుష్క ఖాళీగా ఉన్నప్పుడు కోహ్లీ టూర్లకు వెళ్తుండడం, విరాట్ ఇంట్లో ఉన్నప్పుడు అనుష్క షూటింగులతో బిజీగా ఉండడం.. ఫలితంగా కలిసి గడిపేందుకు ఇద్దరికీ పెద్దగా సమయం దొరకడం లేదట. ఇద్దరూ కలిసి కొన్ని రోజులు విహార యాత్రలో గడిపి వచ్చారు. అయితే అదేమంత పెద్ద సమయం కాదు. కమిట్మెంట్ల కారణంగా ముంబైకి తిరిగి వచ్చేశారు.
ప్రస్తుతం విరాట్ వెన్నెముక గాయం నుంచి కోలుకుంటున్నారు. త్వరలో ఐర్లాండ్తో సీరిస్ ఉన్న కారణంగా ఫిట్నెస్ పరీక్ష నిరూపించుకునేందుకు జాతీయ క్రికెట్ అకాడమీలో పాల్గొంటున్నాడు. అనుష్క శర్మ కూడా షారుక్ ఖాన్ 'జీరో' సినిమా షూటింగ్లో పాల్గొంటూ బిజీగా ఉంది. దాంతో ఈ జంట కుటుంబం కోసం ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ఏడాదిలో ఓ 21 రోజుల పాటు ఏ పనులూ పెట్టుకోకుండా కలిసి గడిపేందుకు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారట. ఈ మధ్య ఇద్దరూ కలిసి కారులో వెళుతూ, రోడ్డుపై చెత్తవేసిన ఓ వ్యక్తిని తిట్టి పోశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్న కోహ్లీ.. అనుష్కలు. నెటిజన్ల నుంచి కామెంట్లు కూడా ఎదుర్కొన్నారు.