మీ పెళ్లి మా దగ్గర చేసుకోండి
అయితే కోహ్లీ-అనుష్క శర్మల వివాహంపై అధికారిక ప్రకటన లేకపోయినా.... 'మీ పెళ్లి మా దగ్గర చేసుకోండి' అంటూ ఆస్ట్రేలియాకు చెందిన అడిలైడ్ ఓవల్ స్టేడియం నుంచి వీరికి ఆహ్వానం వచ్చింది. ప్రముఖ సెలబ్రిటీల పెళ్లి వేడుకను జరపడం తమ కోరికగా పేర్కొన్న అడిలైడ్ స్టేడియం నిర్వాహకులు కోహ్లీ-అనుష్క పెళ్లిలో భాగస్వామ్యం కావాలనుకుంటున్నట్లు పేర్కొంది. ఈ మేరకు అడిలైడ్ ఓవల్ స్టేడియం సీఈఓ ఆండ్రూ డానియల్స్ మాట్లాడుతూ 'విరాట్ కోహ్లీ-అనుష్కల పెళ్లికి ఆతిథ్యం ఇస్తే మాకది గర్వకారణం. ఈ స్టేడియంలో విరాట్ కోహ్లీ పెళ్లి జరిగితే మరెన్నో చిరస్మరణీయమైన జ్ఞాపకాల్ని సొంతం చేసుకుంటాడు. కోహ్లీకి అడిలైడ్ ఓవల్ స్టేడియంలో మెరుగైన రికార్డు ఉంది' అని ఆయన తెలిపారు.
అడిలైడ్ ఓవల్లో మూడు టెస్టు సెంచరీలు
అడిలైడ్ ఓవల్ స్టేడియంలో విరాట్ కోహ్లీ 2012లో తన అరంగేట్రపు సెంచరీతో కలుపుకుని ఇక్కడ మూడు టెస్టు సెంచరీలు సాధించాడు. అంతేకాదు టీ20ల్లో కోహ్లీ నమోదు చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు (90) పరుగులు ఇక్కడే నమోదు చేయడం విశేషం. దీంతో పాటు అడిలైడ్ ఓవల్ స్టేడియంలో మొత్తం ఎనిమిది ఇన్నింగ్స్లు ఆడిన కోహ్లి 89 యావరేజితో 624 పరుగులు నమోదు చేశాడు. ఆ క్రమంలోనే విరాట్-అనుష్కల పెళ్లిని 146 సంవత్సరాల చరిత్ర కలిగిన స్టేడియంలో జరుపుకోవాలని సీఈఓ ఆండ్రూ డానియల్స్ కోరారు.
యాషెస్లో రెండో టెస్టుకు ఆతిథ్యం
ఇదిలా ఉంటే ఐదు టెస్టుల యాషెస్ సిరిస్లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఇటీవల ముగిసిన రెండో టెస్టుకి అడిలైడ్ ఓవల్ ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ టెస్టు మ్యాచ్కి అత్యధికంగా 200,000 మంది వీక్షకులు హాజరయ్యారు. ఈ టెస్టులో ఇంగ్లాండ్పై ఆసీస్ 120 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ స్టేడియంలో ప్రైవేట్ ఫంక్షన్లు కూడా నిర్వహిస్తుంటారు. ఇక పెళ్లి విషయానికి వస్తే ఒక్కో అతిథికి $159 అంటే రూ. 8000లను ఛార్జిగా వసూలు చేస్తారు. మరోవైపు విరాట్ కోహ్లీ-అనుష్క శర్మల పెళ్లిన నేపథ్యంలోనే కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ సెలవు పెట్టారంటూ మరో వార్త కూడా వచ్చింది.
కోహ్లీ చిన్ననాటి కోచ్ సెలవుపై ఊహాగానాలు
రాజ్కుమార్.. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అండర్-23 కోచ్గా ఉన్నారు. వచ్చే వారం ఢిల్లీకి తమిళనాడుతో కీలకమైన మ్యాచ్ ఉంది. అయినా సరే రాజ్ కుమార్ సెలవు పెట్టాడు. కుటుంబ కారణాలతో సెలవు పెడుతున్నానని రాజ్కుమార్ చెప్పాడని.. అతడి స్థానంలో వేరొకరిని కోచ్గా నియమించామని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు తెలిపారు. డిసెంబర్ 12న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు ఇటలీలో పెళ్లి చేసుకోనున్నారన్న వార్తలు రాగా... అదే రోజున రాజ్ కుమార్ సెలవు తీసుకోవడంతో అతడు ఇటలీకి వెళుతున్నారంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే ఇప్పుడు పెళ్లి కాదు.. నిశ్చితార్థం జరగనుందని అంటున్నారు. చూద్దాం... ఏం జరుగుతుందో!