
మొహాలీ: బుధవారం రాత్రి సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 'చేజింగ్ కింగ్' కెప్టెన్ విరాట్ కోహ్లీ (52 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 72 నాటౌట్), స్టార్ ఓపెనర్ శిఖర్ ధవన్ (31 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్తో 40) రాణించడంతో భారత్ లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ పట్టిన ఓ అద్భుత క్యాచ్కు కోహ్లీ, ధావన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వీరి హావభావాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
లక్ష్య ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ (12) త్వరగానే పెవిలియన్ చేరాడు. ధావన్, కోహ్లీలు ప్రొటీస్ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. ఇద్దరూ బౌండరీల మోత మోగిస్తూ మంచి ఊపులో ఉన్నారు. ఈ సమయంలో ప్రొటీస్ స్పిన్నర్ శంసి బౌలింగ్లో ధావన్ ముందుకు వచ్చి లాంగ్ ఆన్ దిశగా భారీ షాట్ ఆడాడు. బంతి కాస్త గాల్లోకి లేవగా.. బౌండరీ వద్ద ఏ మాత్రం అవకాశం లేని చోట మిల్లర్ చిరుతలా పరుగెత్తుకువచ్చి ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో ఒడిసి పట్టుకున్నాడు. దీంతో ప్రొటీస్ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు.
మిల్లర్ స్టన్నింగ్ క్యాచ్ పట్టడంతో ధావన్, కోహ్లీ ఒకరికొకరు చూసుకుంటూ.. ఏం క్యాచ్ పట్టాడు అన్నట్టు ఎక్సప్రెషన్స్ పెట్టారు. అనంతరం ధావన్ చిరునవ్వు చిందిస్తూ.. పెవిలియన్ బాట పట్టాడు. ప్రస్తుతం కోహ్లీ, ధావన్ హావభావాలకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన స్టయిల్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'ధావన్, కోహ్లీల స్పందన వెలకట్టలేనిది' అని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. 'మిల్లర్ క్యాచ్ ఎంత అద్భుతంగా ఉందో వీరిని చూస్తే తెలుస్తోంది' అని మరో నెటిజన్ ట్వీటాడు. ధావన్ 40 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.