
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ షాట్ల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని లెజెండరీ బ్యాటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఆసియా కప్ 2022లో పాకిస్థాన్ వర్సెస్ భారత్ మధ్య నిన్న ఉత్కంఠగా జరిగిన మ్యాచ్లో 148పరుగులను ఛేజ్ చేసే క్రమంలో వీరిద్దరు ఒకే తరహా షాట్ ఆడి ఔటయిన సంగతి తెలిసిందే. కేఎల్ రాహుల్ వికెట్ను భారత్ ఆదిలోనే కోల్పోయింది.. కానీ రెండో వికెట్కు రోహిత్, విరాట్ల 49పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మళ్లీ మ్యాచ్ను భారత్ వైపు మలుపు తిప్పారు. అయితే వీరిరువురు గ్రౌండ్లో భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించి లెఫ్ట్ ఆర్మర్ మహ్మద్ నవాజ్ చేతిలో ఒకే రీతిలో లాంగాఫ్లో క్యాచ్ ఔటయి పెవిలియన్ బాట పట్టారు. దీంతో 7.5ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 50పరుగులు చేయగా.. ఎనిమిది బంతుల వ్యవధిలో భారత స్కోరు 3 వికెట్ల నష్టానికి 53పరుగులకు చేరుకుని తీవ్ర కష్టాల్లో పడింది.
కోహ్లీ తనకు దక్కిన లైఫ్ లైన్స్ను ఉపయోగించుకుని మరింత బాగా ఆడాల్సిందని గవాస్కర్ భావించాడు. 'ఈ మ్యాచ్లో కోహ్లీకి చాలా అదృష్టం ఉంది. అతను ఇచ్చిన క్యాచ్ డ్రాప్ అయ్యింది. చాలా ఇన్సైడ్ ఎడ్జ్లు అయ్యి వికెట్లకు తాకకుండా మిస్సయ్యాయి. అతనికి అదృష్టం కలిసొచ్చింది. దాన్ని కొంతవరకు సద్వినియోగం చేసుకున్నాడు. చూడచక్కని షాట్లు ఆడాడు. కానీ కోహ్లీ ఓ 60 లేదా 70పరుగులు చేయాల్సింది. రోహిత్ అవుటైన వెంటనే అతను ఔటయ్యాడు. ఇద్దరూ క్షమించరాని షాట్లతో ఔటయ్యారు. ఆ దశలో సిక్సర్లు కొట్టాల్సిన పరిస్థితి లేదు. రిక్వైర్డ్ రన్ రేట్ 19 లేదా 20 ఏం లేదు. జస్ట్ 8గా ఉంది. కాబట్టి అలాంటి రిస్కీ షాట్లు అవసరం లేదు. స్కోరు 70-80కి చేరుకున్న పిదప పెద్ద షాట్లు ఆడాలి. అంతేగానీ కీలక సమయంలో అనవసరమైన షాట్లకు ఎందుకు ఆడాలి. కోహ్లీ, రోహిత్ ఈ గేమ్ నుంచి ఇదే నేర్చుకోవాలి.' అని సునీల్ గవాస్కర్ అన్నాడు. రోహిత్ 12పరుగుల వద్ద అవుట్ కాగా.. విరాట్ 34బంతుల్లో 3ఫోర్లు, ఒక సిక్స్తో 35పరుగులు చేశాడు. రోహిత్, విరాట్ ఔట్ అయిన తర్వాత.. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా వీరోచితంగా పోరాడి భారత్ను ఐదు వికెట్ల తేడాతో గెలిపించారు.