
గెలుపోటముల మధ్య
రెండో టెస్ట్ మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. కోహ్లీసేన నిర్దేశించిన 271 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. పేస్ బౌలింగ్ త్రయం జస్ప్రీత్ బుమ్రా-మహ్మద్ షమీ-ఇషాంత్ శర్మ విజృంభణ ముందు నిలవలేకపోయింది. అలవోకగా తల వంచింది. నిర్ణయాత్మకమైన రెండో ఇన్నింగ్లో 120 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రతిష్ఠాత్మకమైన లార్డ్స్ మైదానంలో భారత్ చేతిలో 151 పరుగుల తేడాతో మట్టి కరిచింది. మూడో టెస్ట్లో ప్రతీకారాన్ని తీర్చుకోవాలనే కసిని రగిలింపజేసింది.

ఓటమిని జీర్ణించుకోలేక..
లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఎలాంటిదో మనకు తెలుసు. క్రికెట్ అంటే ఇష్టపడే ప్రతి అభిమానికి కూడా లార్డ్స్కు ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. క్రికెట్ మక్కాగా పేరున్న స్టేడియం అది. అలాంటి స్టేడియంలో విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు చేతిలో ఓడిపోవడాన్ని ఇంగ్లాండ్ జట్లు తలవంపులుగా భావించినట్టుంది. 271 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయామనే ఆగ్రహావేశాలు జట్టు ప్లేయర్లలో వ్యక్తమయ్యాయి.

వారిద్దరి మధ్య వాగ్యుద్ధానికి కొనసాగింపుగా..
ఈ మ్యాచ్ ముగిసిన తరువాత.. విరాట్ కోహ్లీ-జో రూట్ మధ్య వాడివేడిగా వాగ్యుద్ధం నడిచినట్లు తెలుస్తోంది. దీనికి లార్డ్స్ పెవిలియన్ లాంగ్రూమ్ వేదికగా మారాయని సమాచారం. రెండో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు జస్ప్రీత్ బుమ్రా.. ఇంగ్లాండ్ టెయిలెండ్ బ్యాట్స్మెన్ జిమ్మీ అండర్సన్ను టార్గెట్గా చేసుకుని వరుసగా షార్ట్ పిచ్ బంతులను సంధించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కూడా ఆ ఇద్దరి మధ్య వాగ్యుద్ధం చోటు చేసుకుంది. ఆ తరువాత అదే హీటెడ్ ఆర్గ్యుమెంట్ కొనసాగినట్లు యునైటెడ్ కింగ్డమ్కు చెందిన డెయిలీ టెలిగ్రాఫ్ తెలిపింది.

లాంగ్ రూమ్లో ఆర్గ్యుమెంట్
మ్యాచ్ ముగిసిన అనంతరం లార్డ్స్ స్టాఫ్, క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు, అధికారులు తిరుగాడే లాంగ్ రూమ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకున్న డెయిలీ టెలిగ్రాఫ్ తెలిపింది. లార్డ్స్ లాంగ్ రూమ్ను రెండు జట్ల క్రికెటర్లు, సపోర్టింగ్ స్టాఫ్, మేనేజ్మెంట్కు కామన్ పాయింట్గా చెబుతుంటారు. గ్రౌండ్ నుంచి వచ్చిన రెండు జట్ల ఆటగాళ్లు ఈ లాంగ్ రూమ్ పాయింట్ మీదుగానే తమ తమ డ్రెస్సింగ్ రూమ్లకు వెళ్లాల్సి ఉంటుంది.

డైనింగ్ రూమ్గా
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో లాంగ్ రూమ్లో ఎంట్రీ ఇవ్వడానికి ప్లేయర్లకు తప్ప మరొకరికి అవకాశం ఇవ్వట్లేదు.. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు అధికారులు. దీనితో ఈ లాంగ్ రూమ్ను డైనింగ్ రూమ్గా కన్వర్ట్ చేశారు. సెషన్ పూర్తయిన తరువాత.. లంచ్ బ్రేక్, టీ బ్రేక్ కోసం రెండు జట్ల ఆటగాళ్లు ఇక్కడికే చేరుకోవాల్సి ఉంటుంది. అలాంటి చోట విరాట్ కోహ్లీ-జో రూట్ మధ్య వాగ్యుద్ధం చోటు చేసుకున్నట్లు డెయిలీ టెలిగ్రాఫ్ పేర్కొంది. గ్రౌండ్లో జస్ప్రీత్ బుమ్రా-అండర్సన్ మధ్య చోటు చేసుకున్న వాగ్యుద్ధం జరిగిన రోజు, అయిదో రోజు మ్యాచ్ ముగిసిన తరువాత కోహ్లీ-జో రూట్ ఒకరినొకరు మాటల యుద్ధానికి దిగినట్లు పేర్కొంది.


Click it and Unblock the Notifications












