
అహ్మదాబాద్: నరేంద్ర మోడీ మైదానంలో భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి సెషన్లోనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇంగ్లండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ఔటైన తర్వాత స్టోక్స్ బ్యాటింగ్కు దిగాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్.. స్టోక్స్కి షార్ట్ లెంగ్త్ రూపంలో వరుసగా బంతుల్ని సంధిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో స్టోక్స్కు సిరాజ్ ఓ బౌన్సర్తో గట్టి సవాలు విసిరాడు.
ఆ బంతిని ఎదుర్కొన్న తర్వాత మొహ్మద్ సిరాజ్ను బెన్ స్టోక్స్ ఏదో అన్నాడు. సిరాజ్ కూడా అదే రీతిలో బదులిచ్చాడు. ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధాన్ని గమనించిన విరాట్ కోహ్లీ.. ఆ ఓవర్ ముగిసిన తర్వాత అతడే స్వయంగా రంగంలోకి దిగాడు. కాసేపు స్టోక్స్తో వాదించాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో ఫీల్డ్ అంపైర్లు కలగజేసుకుని ఇద్దరికీ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఇద్దరూ కాసేపు వెనక్కి తగ్గలేదు. చివరకు గొడవ సద్దుమనిగింది.
ఆ తర్వాతి ఓవర్లోనూ మహ్మద్ సిరాజ్, బెన్ స్టోక్స్ మధ్య కాస్త మాటల యుద్ధం నడిచింది. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో మళ్లీ సిరాజ్ బౌలింగ్కిరాగా.. స్టోక్స్ మూడు ఫోర్లు బాది 13 పరుగులు పిండుకున్నాడు. దాంతో ఆ ఓవర్లోనూ మళ్లీ సిరాజ్, స్టోక్స్ మధ్య మాటల యుద్ధం నడిచింది. అయితే ఈసారి విరాట్ కోహ్లీ అక్కడకు రాలేదు. వాస్తవానికి కోహ్లీ, స్టోక్స్ మధ్య 2014 నుంచే ఓ చిన్నపాటి యుద్ధం నడుస్తోంది. ఇంగ్లండ్ టూర్లో కోహ్లీ వికెట్ పడగొట్టిన స్టోక్స్ అప్పట్లో నోరుజారగా.. కోహ్లీ కూడా ధీటుగా బదులిచ్చాడు. అప్పటి నుంచి ఆ యుద్ధం అలాగే కొనసాగుతోంది.
భారత్తో జరుగుతున్న నాలుగో టెస్ట్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. లంచ్ సమయానికి 25 ఓవర్లలో 3 వికెట్లకు 74 పరుగులు చేసింది. జానీ బెయిర్స్టో 28 పరుగులు, బెన్ స్టోక్స్ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఓ దశలో 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును స్టోక్స్, బెయిర్స్టోలు ఆదుకున్నారు. ఈ ఇద్దరు కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ మొదటి సెషన్ను ముగించారు. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ రెండు.. మొహ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీశాడు.