ముంబై: భారత్లో అత్యంత ఖరీదైన టోర్నీగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు పేరుంది. అయితే ఈ టోర్నీలో అత్యధిక జీతం తీసుకుంటున్న ఆటగాడిగా టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలిచాడు. ఐపీఎల్ ప్రాంఛైజీలు ఆటగాళ్లకు చెల్లించే జీతాలను జాబితాను బీసీసీఐ విడుదల చేసింది.
దీంతో ఐపీఎల్లో అత్యంత ఖరీదైన ఆటగాడెవరో తెలిసిపోయింది. సాధారణంగా ఐపీఎల్ వేలం పాటలో ఆటగాళ్లకు చూపించేది ఎక్కువ, కానీ ఇచ్చేది మాత్రం తక్కువగా ఉంటుంది. మరికొందరి ఆటగాళ్లకు ఇచ్చేది ఎక్కువ, చూపించేది మాత్రం తక్కువగా ఉంటుంది.
ఈ రెండో కేటగిరికి విరాట్ కోహ్లీ చేరాడు. ప్రస్తుత ఐపీఎల్ టోర్నమెంట్లో విరాట్ కోహ్లీనే నెంబర్వన్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతడికి రూ.15 కోట్లు ఇస్తున్నట్లు వెల్లడైంది. గతేడాది వరకు ఐపీఎల్ టోర్నీలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా యువరాజ్ సింగే ఉన్నారు. అతడికి ఢిల్లీ ప్రాంచైజీ రూ.16 కోట్ల దాకా చెల్లించింది.

వేలంలో విరాట్ కోహ్లీని రూ. 12.5 కోట్లకు బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ప్రాంఛైజీ దక్కించుకుంది. అయితే వేలంలో దక్కినదానికంటే రూ. 2.5 కోట్లు అధికంగా విరాట్ కోహ్లీకి ప్రాంఛైజీ చెల్లిస్తుంది. ఆ తర్వాతి స్థానాల్లో ధోనికి చెన్నై, ధావన్కు సన్రైజర్స్ రూ.12.5 కోట్లతో ఉన్నారు.
రోహిత్ శర్మకు ముంబై రూ.11.5 కోట్లు ఇస్తుండగా... గంభీర్కు నైట్రైడర్స్ రూ.10 కోట్లు చెల్లిస్తోంది. వేలం సమయంలో, ఆటగాళ్లను రిటైన్ చేసుకునే సమయంలో తగ్గించే మొత్తానికి, జీతాలకు సంబంధం ఉండదు. తాజాగా రాజ్కోట్ రైనాను తీసుకున్నందుకు రూ.12.5 కోట్లు చెల్లిస్తోంది.
రవీంద్ర జడేజాను తీసుకున్నందుకు రూ.9.5 కోట్లు ప్రాంచైజీ నుంచి తగ్గించుకుంది. వాస్తవానికి ఈ ఇద్దరికీ అంతకంటే తక్కువే చెల్లిస్తోంది. రైనా జీతం రూ.9.5 కోట్లు కాగా... జడేజాకు రూ.5.5 కోట్లు దక్కనుంది. ముంబై ఇండియన్స్ హర్భజన్ను వేలంలో రూ. 5.5 కోట్లకు దక్కించుకోగా, అతనికి చెల్లించే అసలు జీతం రూ. 8 కోట్లు.
ఇక రాయుడు కూడా ముంబైకి రూ. 4కోట్లకు అమ్ముడుపోయినా, రూ. 6 కోట్లు చెల్లిస్తున్నారు. డివిలియర్స్ (రూ. 9.5 కోట్లు), అశ్విన్ (రూ. 7.5 కోట్లు), డ్వెన్ బ్రావో (రూ. 4 కోట్లు)ల కొనుగోలు, చెల్లించే ధర ఒకటే. ఇక వెస్టిండీస్ ఆటగాడు గేల్ వేలంలో ధర రూ. 7.5 కోట్లకు అమ్ముడైనా, చెల్లించేది మాత్రం రూ. 8.4 కోట్లు.