రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మురిసింది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ను మట్టికరిపించి ప్లేఆఫ్స్కు చేరింది. కేవలం గెలిస్తే సరిపోదు, సీఎస్కే నెట్రన్రేటును అధిగమించి నెగ్గాల్సిన డూ ఆర్ డై మ్యాచ్లో 27 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. డుప్లెసిస్ (54; 39 బంతుల్లో, 3X4, 3X6) టాప్ స్కోరర్.
విరాట్ కోహ్లి (47; 29 బంతుల్లో, 3X4, 4X6), రజత్ పటిదార్ (41; 23 బంతుల్లో, 2X4, 4X6), కామెరూన్ గ్రీన్ (38*; 17 బంతుల్లో, 3X4, 3X6) సత్తాచాటారు. మిచెల్ శాంట్నర్ (1/23) పొదుపుగా బౌలింగ్ చేశాడు. అయితే ఆర్సీబీ 219 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ, ప్లేఆఫ్స్ చేరాలంటే చెన్నైని 200 పరుగులకే కట్టడి చేయాలి. కాగా, ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఛేదనలో సీఎస్కే 20 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 191 పరుగులకు పరిమితమైంది.

రచిన్ రవీంద్ర (61; 37 బంతుల్లో, 5X4, 3X6), రవీంద్ర జడేజా (42; 22 బంతుల్లో, 3X4, 3X6), అజింక్య రహానె (33; 22 బంతుల్లో, 3X4, 1X6), ఎంఎస్ ధోనీ (25; 13 బంతుల్లో, 3X4, 1X6) పోరాడారు.ప్లేఆఫ్స్కు క్వాలిఫై కావాలంటే సీఎస్కేకు చివరి ఆరు బంతుల్లో 17 పరుగులు అవసరమైన వేళ బంతిని అందుకున్న యశ్ దయాల్ గొప్పగా బౌలింగ్ చేశాడు. తొలి బంతిని ధోనీ స్టేడియం బయటకు పంపించినా ఒత్తిడి జయిస్తూ యశ్ ఆఖరి అయిదు బంతుల్లో ఒక్క పరుగే ఇచ్చాడు. ఆర్సీబీకి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
కాగా, విజయానంతరం యశ్ దయాల్ మాట్లాడుతూ తన గొప్ప ప్రదర్శనకు విరాట్ కోహ్లి, డుప్లెసిన్ ఓ కారణమని అన్నాడు. గత సీజన్లో తన బౌలింగ్లో రింకూ సింగ్ అయిదు సిక్సర్లు బాదిన తర్వాత తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాని, దాన్ని అధిగమించి సత్తాచాటేలా కోహ్లి స్ఫూర్తి నింపాడని చెప్పాడు. ''ఫ్రాంచైజీకి వచ్చిన తొలి రోజు నుంచి నేను వాళ్లకు ఎంతో కీలక ప్లేయర్ను అని ఆర్సీబీ చెప్పింది. ఎంతో మద్దతు ఇచ్చింది. ఇవాళ చక్కని ప్రదర్శన చేయడానికి వాళ్లు నాపై ఉంచిన నమ్మకమే కారణం''
''డుప్లెసిస్ గొప్ప కెప్టెన్. జట్టులో డుప్లెసిస్, కోహ్లి ఉన్నారు. యువ ఆటగాళ్లు ప్రశాంతతో ఉంటూ ఒత్తిడి జయించడానికి వారిద్దరు ఎంతో సాయం చేస్తుంటారు. ఈ సీజన్ ప్రారంభానికి ముందు కోహ్లి నాతో చెప్పిన మాటలు నాకు గుర్తు ఉన్నాయి. గతంలో నేను ఎదుర్కొన్న విమర్శల గురించి మాట్లాడాడు. 'ఇలాంటి సంఘటనలు నేను కూడా ఎదుర్కొన్నాను. ఈ విమర్శలను ఎలా ఎదుర్కోవాలో నేను చెప్తాను. నీతో నేను ఉంటాను' అని కోహ్లి అన్నాడు. ఆ మాటలు నాకెంతో సాయం చేశాయి '' అని యశ్ దయాల్ అన్నాడు.