భారత క్రికెట్లో అందరి కన్నా ఎక్కువ హేట్ ఎదుర్కొన్న ప్లేయర్ రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్. తాజాగా ముగిసిన దియోధర్ ట్రోఫీలో పరాగ్ చెలరేగాడు. ఈ టోర్నీలో ఐదు ఇన్నింగ్సుల్లో 354 పరుగులతో రాణించాడు. అలాగే టోర్నీలో అత్యధిక సిక్సర్లు (23) బాదాడు. అతనికే ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు కూడా దక్కింది.
అయితే కొన్ని రోజుల క్రితం జరిగిన ఐపీఎల్ 16వ సీజన్లో పరాగ్ పెద్దగా రాణించలేదు. సీజన్లో ఏడు ఇన్నింగ్సులు ఆడిన అతను కేవలం 78 పరుగులే చేసి విమర్శలపాలయ్యాడు. ఇలాంటి కష్టకాలంలో సలహా కోసం స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని పరాగ్ సంప్రదించాడట. కోహ్లీ సలహా వల్లనే తనలో మార్పు వచ్చిందని అతను చెప్పాడు.

తమ మధ్య జరిగిన పూర్తి సంభాషణ చెప్పలేనన్న పరాగ్.. కోహ్లీ మాటలను గుర్తు చేసుకున్నాడు. 'ఆరు నెలల పాటు పనిచేసిన టెక్నిక్ సడెన్గా పనిచేయకుండా పోదు. ఐపీఎల్ చాలా వేగంగా వెళ్లిపోతుందిజ దీంతో ఒకటి రెండు మ్యాచులు ఫెయిలవగానే.. మన సత్తాను మనమే ప్రశ్నించుకోవడం మొదలు పెడతాం' అని కోహ్లీ చెప్పాడట.
అక్కడితో ఆగకుండా.. 'ప్రతి ఒక్కరు పొరపాట్లు చేస్తారు. నేను కూడా చాలా మిస్టేక్స్ చేశా. రెండు, మూడు మ్యాచులు మనం అనుకున్నట్లు ఆడలేకపోతే.. మన ప్రాసెస్, వర్క్ ఎథిక్ మార్చుకోవాలని అనుకుంటాం' అని కోహ్లీ వివరించినట్లు పరాగ్ వెల్లడించాడు. ప్రస్తుతం బ్యాడ్ ఫేజ్లో ఉన్నాననే నిజాన్ని స్వీకరించాలని కోహ్లీ చెప్పాడట.
కోహ్లీ కూడా మూడేళ్లపాటు చాలా పేలవ ఫామ్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత నెలరోజుల విశ్రాంతి తీసుకున్న అతను.. మళ్లీ తన బెస్ట్ ఫామ్ అందుకున్నాడు. ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్లో అద్భుతంగా రాణించాడు. ఐపీఎల్ చివర్లో వరుస సెంచరీలతో ఆకట్టుకున్నాడు. వచ్చే ఆసియా కప్లో మళ్లీ కోహ్లీని మైదానంలో చూసేందుకు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.