
దుబాయ్: టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్
(సీఎస్కే) కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మ్యాచ్ ఎంత ఉత్కంఠతో ఉన్నా.. ఎలాంటి బెరుకు లేకుండా ఆడుతాడు. కూల్గా తనపని తాను చేసుకుపోతాడు. చివరి ఓవర్లో 15-20 పరుగులు అవసరం అయినా.. తనదైన శైలిలో మ్యాచును ఫినిష్ చేస్తాడు. అందుకే మహీ బెస్ట్ ఫినిషర్గా పేరుగాంచాడు. అయితే ధోనీ గతకొంతకాలంగా ఫినిషర్ పాత్రను సరిగ్గా పోషించడం లేదు. చివరి ఓవర్లలో తడబడుతున్నాడు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్తో దుబాయ్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన ఐపీఎల్ 2021 క్వాలిఫయర్-1 మ్యాచ్లో ధోనీ చెలరేగాడు. చివరి రెండు ఓవర్లలో ఒక సిక్సర్, మూడు ఫోర్లు బాది చెన్నైని ఫైనల్కు తీసుకెళ్లాడు. దీంతో మహీ అభిమానులు, పలువురు ప్రముఖులు సంతోషం వ్యక్తం చేశారు.

84 మీటర్ల భారీ సిక్స్:
173 పరుగుల ఛేదనలో రుతురాజ్ గైక్వాడ్ (70; 50 బంతుల్లో 5×4, 2×6), రాబిన్ ఉతప్ప (63; 44 బంతుల్లో 7×4, 2×6)ల చెలరేగడంతో చెన్నై లక్ష్యం దిశగా సాగింది. చెన్నై విజయానికి చివరి 12 బంతుల్లో 24 పరుగులు అవసరం అయ్యాయి. అప్పటి వరకూ చెన్నైకి అండగా నిలిచిన ఓపెనర్ గైక్వాడ్ ఔట్ అయ్యాడు. దాంతో మొయిన్ అలీ, అప్పుడే క్రీజులోకి వచ్చిన ఎంఎస్ ధోనీపై భారం పడింది. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో అవేష్ ఖాన్ బౌలింగ్లో ఓ అద్భుత సిక్స్తో మహీ పరుగుల ఖాతా తెరిచాడు. మహీ 84 మీటర్ల భారీ సిక్స్ బాదాడు. అదే ఓవర్లో అలీ కూడా ఓ ఫోర్ కొట్టడంతో మొత్తం 11 పరుగులు వచ్చాయి. దాంతో చెన్నై గెలుపు సమీకరణం 6 బంతుల్లో 13 పరుగులుగా మారిపోయింది.

హ్యాట్రిక్ ఫోర్లతో ముగింపు:
చివరి ఓవర్లో టామ్ కరన్ బౌలింగ్కి రాగా.. మొదటి బంతికే మొయిన్ అలీ (16: 12 బంతుల్లో 2x4) ఔట్ అయ్యాడు. దాంతో మ్యాచ్ ఉత్కంఠకు తెరలేపింది. ఎంఎస్ ధోనీ క్రీజులో ఉన్నా.. ఫామ్లో లేనికారణంగా అతడిపై పెద్దగా అంచనాలు లేవు. రవీంద్ర జడేజాపై అందరూ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఇక్కడే మహీ మాయ చేశాడు. ఒత్తిడిలోనూ మ్యాచ్లను ఎలా ఫినిష్ చేయాలో తెలిసిన ధోనీ.. వరుసగా మూడు బంతులను బౌండరీకి తరలించేశాడు. మధ్యలో టామ్ ఓ వైడ్ వేయడంతో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే చెన్నై విజయాన్ని అందుకుంది. ధోనీ 6 బంతుల్లో మూడు ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 18 పరుగులు చేశాడు. మహీ స్ట్రైక్ రేట్ 300లుగా ఉండడం విశేషం.
ఎగిరి గంతేసేలా చేశాడు:
ఎంఎస్ ధోనీ తన అద్భుత బ్యాటింగ్తో చెన్నై సూపర్ కింగ్స్ను ఫైనల్ చేర్చడంతో సోషల్ మీడియాలో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మహీ బ్యాటింగ్ చూసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆనందం వ్యక్తం చేశాడు. 'కింగ్ ఈజ్ బ్యాక్' అని ట్వీట్ చేశాడు. 'ఫైనల్లీ కింగ్ ఈజ్ బ్యాక్. క్రికెట్లో అతిగొప్ప ఫినిషర్ అయిన ఎంఎస్ ధోనీ అంటే నాకు ఎంతో ఇష్టం. ఈరాత్రి మరోసారి నన్ను కూర్చున్న సీట్లో నుంచి ఎగిరి గంతేసేలా చేశాడు' అని మ్యాచ్ అయినా వెంటనే కోహ్లీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. కోహ్లీ ఎప్పుడూ మహీపై ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. మహీ నుంచి కోహ్లీ జట్టు పగ్గాలు అందుకున్న విషయం తెలిసిందే.
మహీ నువ్ సూపర్:
'వావ్.. ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగింది. ఓటమిపాలైన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇంకో మ్యాచ్లో గెలవాలని ఆశిస్తున్నా. ఇప్పుడు విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అభినందనలు. కెప్టెన్ ఎంఎస్ ధోనీ మరోసారి ఫినిషర్గా జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటూనే తన ఆటగాళ్లలో స్ఫూర్తి కలిగించాడు. మహీ నువ్ సూపర్' అని పంజాబ్ కింగ్స్ కో ఓనర్, బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ప్రీతి జింతా ట్వీట్ చేశారు. 'ఫినిషర్గా ఎంఎస్ ధోనీది ఇదో కళాత్మక ప్రదర్శన. చాలా అద్భుతంగా ఆడాడు. అతడిలా మ్యాచ్లు ముగిస్తే ఎన్నో జ్ఞాపకాలు మన కళ్లముందు కదలాడుతాయి' అని బీసీసీఐ సెక్రటరీ జై షా పేర్కొన్నారు.

ఏడో నంబర్ బాగా కలిసి వస్తుంది:
'ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ చూసి ఎంతో సంతోషంగా ఉంది. మహీ అద్భుతంగా ఆడాడు. అతడి బ్యాటింగ్ గురించి అనేక మంది మాట్లాడారు. అతడికి ఏడో నంబర్ బాగా కలిసి వస్తుంది. ఈరోజు చాలా గొప్పగా ముగించాడు' అని ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్, స్టార్ కెమెంటేటర్ మాథ్యూ హెడెన్ ట్వీట్ చేశారు. 'రవీంద్ర జడేజా బాగా ఆడుతున్నా.. ఈసారి ఎంఎస్ ధోనీనే ముందు బ్యాటింగ్కు వచ్చాడు. తను బాధ్యత తీసుకొని కెప్టెన్గా గెలిపించాలనుకున్నాడు. ఇది నిజంగా చాలా మంచి విషయం. అవసరమైన వేళ బరిలోకి దిగి స్టైలిష్గా పని పూర్తి చేశాడు. మహీ నువ్ సూపర్' అని భారత బ్యాటింగ్ దిగ్గజం, ప్రముఖ వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్ ట్వీటారు.


Click it and Unblock the Notifications












