మూడుసార్లు ఫైనల్ చేరినా:
2013లో డేనియల్ వెటోరి నుంచి విరాట్ కోహ్లీ ఆర్సీబీ జట్టు బాధ్యతలు అందుకున్నాడు. అప్పటినుంచి జట్టు కెప్టెన్గా కొనసాగుతున్న కోహ్లీ.. ప్రతిసారీ భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్నాడు కానీ ఒక్కసారీ కప్పు అందుకోలేదు. విరాట్ సారథ్యంలో 2016లో ఆర్సీబీ ఫైనల్ చేరుకుంది. మొత్తంగా మూడుసార్లు ఫైనల్ చేరినా ఆర్సీబీ టైటిల్ మాత్రం పట్టలేకపోయింది. ఇక గత మూడు సీజన్లలో అయితే పేలవ ఆటతో కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరలేకపోయింది. ఈసారి సీజన్ తొలి అంచెలో ఆర్సీబీ మెరుగైన ప్రదర్శన చేయడంతో మళ్లీ కప్పుపై ఆశలు రేగాయి. యూఏఈలో రెండో అంచె ఆరంభానికి ముందు ఆర్సీబీ కెప్టెన్గా ఇదే తన చివరి సీజన్ అని విరాట్ ప్రకటించడంతో ఈసారి కప్పు గెలిచి తీరాల్సిందే అన్న భావన అభిమానుల్లో కలిగింది. బెంగళూరు ఆటగాళ్లు సైతం కోహ్లీ కోసం కప్పు సాధిస్తామని వాగ్దానాలు కూడా చేశారు.
13 ఏళ్లుగా జరుగుతున్నదే:
యూఏఈలో జరుగుతున్న రెండో అంచెలోనూ రాణించి ప్లే ఆఫ్స్ చేరడంతో.. ఆర్సీబీ టైటిల్కు చేరువవుతున్నట్లే కనిపించింది. కానీ సోమవారం రాత్రి కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ ద్వారా అభిమానుల ఆశలు, అంచనాలన్నీ ఒక్కసారిగా గాల్లో కలిసిపోయాయి. 13 ఏళ్లుగా జరుగుతున్నదే ఈసారీ పునరావృతం అయింది. విరాట్ కోసం కప్పు గెలుస్తామన్న మాటను అతడి సహచరులు నిలబెట్టుకోలేకపోయారు. అయితే ఈసారి బెంగళూరు అభిమానుల వేదన మాత్రం అంతాఇంతా కాదు. ఐపీఎల్ టైటిల్ కోసం ఎంతో తపించిన విరాట్.. చివరికి ఆ కల నెరవేర్చుకోకుండానే కెప్టెన్సీ విడిచిపెడుతుండటమే అందుకు ప్రధాన కారణం. మ్యాచ్ ఓటమి ఖరారు కాగానే ఆర్సీబీ అభిమానుల మొహాలు తేలిపోయాయి. ఇక మ్యాచ్ అవ్వగానే మైదానంలోనే వారు ఏడ్చేశారు. కంటతడి పెట్టుకొంటూ మైదానాన్ని వీడారు.
|
మైదానంలోనే ఏడ్చేసిన కోహ్లీ:
మొత్తానికి విరాట్ కోహ్లీ సారథిగా చివరి ప్రయత్నంలోనూ ఐపీఎల్ కప్పు వేటలో విజయవంతం కాలేదు. ఓవైపు రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ జట్టుకు అయిదు సార్లు ఐపీఎల్ ట్రోఫీ అందిస్తే.. కోహ్లీ ఒక్కసారి కూడా దాన్ని ముద్దాడలేకపోయాడు. ఇది అభిమానులకు ఎప్పటికీ రుచించని విషమయే. ఐపీఎల్ టోర్నీ విరాట్ కెరీర్లో ఎప్పటికీ ఒక లోటే. గత సీజన్లలో ఆర్సీబీ లీగ్ దశల్లోనే నిష్క్రమించినపుడు కూడా ఉద్వేగానికి గురి కాకుండా తర్వాతి సీజన్ ఉందికదా అనుకుని మామూలుగా కనిపించిన కోహ్లీ.. ఇప్పుడు ఆ అవకాశం లేకపోవడంతో ఉద్వేగానికి గురయ్యాడు. కోహ్లీ కళ్లలో ఆ బాధ స్పష్టంగా కనిపించింది. మైదానంలోనే ఏడ్చేశాడు. తన కళ్లలోకి వచ్చిన నీళ్లను తుడుచుకుంటూ కనిపించిన కోహ్లీ.. తన బాధను క్యాప్తో కవర్ చేశాడు. అది చూసిన ఫాన్స్ మరింత బాధకు గురయ్యారు. మరోవైపు ఏబీ డివిలియర్స్, మొహ్మద్ సిరాజ్ కూడా మైదానంలోనే కంటతడి పెట్టారు. ఇందుకు సంబందించిన వీడియో, పోటీలు నెట్టింట వైరల్ అయ్యాయి.
|
4 వికెట్ల తేడాతో ఓటమి:
షార్జాలో సోమవారం రాత్రి జరిగిన ఎలిమినేటర్ మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 4 వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్పై ఓడిపోయింది. సునీల్ నరైన్ (4/21) అద్భుత బౌలింగ్ కారణంగా మొదట బెంగళూరు 7 వికెట్లకు 138 పరుగులే చేయగలిగింది. విరాట్ కోహ్లీ (39; 33 బంతుల్లో 5×4) టాప్ స్కోరర్. శుభ్మన్ గిల్ (29; 18 బంతుల్లో 4×4), వెంకటేశ్ అయ్యర్ (26; 30 బంతుల్లో 1×6), సునీల్ నరైన్ (26; 15 బంతుల్లో 3×6) రాణించడంతో స్వల్ప లక్ష్యాన్ని కోల్కతా మరో రెండు బంతులు మిగిలి ఉండగా 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మొహ్మద్ సిరాజ్ (2/19), హర్షల్ పటేల్ (2/19), యుజ్వేంద్ర చహల్ (2/16) జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా లాభం లేకుండాపోయింది.