ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ
ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. రోహిత్ శర్మ (48: 33 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్), హార్దిక్ పాండ్యా (32 నాటౌట్: 14 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులు) చెలరేగడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.

188 పరుగుల లక్ష్య చేధనలో
ముంబై నిర్దేశించిన 188 పరుగుల లక్ష్య చేధనలో బెంగళూరు బ్యాట్స్మన్ ఏబీ డివిలియర్స్ (70 నాటౌట్: 41 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడినా జట్టుని గెలిపించలేకపోయాడు. నిర్ణీత ఓవర్లలో బెంగళూరు 5 వికెట్లు కోల్పోయి 181 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్లో బెంగళూరు విజయానికి ఆఖరి 18 బంతుల్లో 40 పరుగులు అవసరమయ్యాయి.

హార్దిక్ పాండ్యా బౌలింగ్లో వరుసగా 4, 6, 6 బాదిన డివిలియర్స్
ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా బౌలింగ్లో వరుసగా 4, 6, 6 బాదిన ఏబీ డివిలియర్స్ 18 పరుగులు రాబట్టాడు. దీంతో సమీకరణం 12 బంతుల్లో 22 పరుగులుగా మారింది. ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన జస్ప్రీత్ బుమ్రా తన అద్భుతమైన బౌలింగ్తో డివిలియర్స్ని కట్టడి చేస్తూ కేవలం 5 పరుగులు మాత్రమే ఇవ్వడంతో పాటు దూకుడుగా ఆడుతోన్న గ్రాండ్హోమ్ (2)ని ఔట్ చేశాడు.

5 బంతుల్లో 17 పరుగులుగా మారిన సమీకరణం
దీంతో సమీకరణం 5 బంతుల్లో 17 పరుగులుగా మారింది. ఇక, ఆఖరి ఓవర్ వేసిన మలింగ తొలి బంతికే సిక్స్ కొట్టించుకున్నా తర్వాత తన యార్కర్లలో వరుసగా 1, 1, 1, 1,0 తో ముంబైని గెలిపించాడు. నిజానికి ఆఖరి బంతిని మలింగ నోబాల్గా విసిరినా ఫీల్డ్ అంపైర్ పసిగట్టలేకపోయాడు. దీంతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది.


Click it and Unblock the Notifications













