సూపర్ ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లి ఐపీఎల్లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో ఉండి ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకున్నాడు. 13 మ్యాచ్ల్లో 66 సగటు, 155 స్ట్రైక్రేటుతో 661 పరుగులు చేశాడు. ఇదే జోరులో ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్తో జరగనున్న మ్యాచ్లో చెలరేగి ఆర్సీబీని ప్లేఆఫ్స్కు చేర్చాలని కోహ్లి కసిగా ఉన్నాడు.
అయితే తన కెరీర్లో రెండు సార్లు హార్ట్ బ్రేక్ అయ్యిందని కోహ్లి తెలిపాడు. ఒకే ఏడాదిలో ఆ రెండు సంఘటనలు చోటు చేసుకున్నాయని వివరించాడు. 2016 టీ20 వరల్డ్ కప్లో భారత్ సెమీఫైనల్లో ఓటమిపాలవ్వడం, అదే ఏడాది ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్లో ఓడి కప్ను చేజార్చుకోవడం తనని ఎంతో బాధించిందని తెలిపాడు.

ఐపీఎల్-2016లో కోహ్లి 16 మ్యాచ్ల్లో 973 పరుగులు చేశాడు. నాలుగు సెంచరీలు, ఏడు హాఫ్ సెంచరీలు బాదాడు. 81 సగటు, 152 స్ట్రైక్రేటుతో రన్స్ సాధించాడు. ఓ సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడి కోహ్లి నెలకొల్పిన 973 పరుగుల రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ఇక ఆ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్లో అయిదు మ్యాచ్ల్లో విరాట్ 273 పరుగులు చేశాడు. భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. కానీ టైటిల్ అందుకోలేకపోయాడు.
తాజాగా ఈ సంఘటనలను కోహ్లి గుర్తు చేసుకున్నాడు. ''నా జీవితంలో, 2016లో నా గుండె రెండు సార్లు బద్దలైంది. ఒకటి టీ20 వరల్డ్ కప్ అయితే, రెండోది ఐపీఎల్ ఫైనల్. టీ20 ప్రపంచకప్లో ఓడిన బాధను అధిగమించడానికి నాకు ఎన్నో రోజుల సమయం పట్టింది. ఎందుకంటే అప్పుడు భారత్కు ట్రోఫీని అందించాలనే కసితో ఎంతో పోరాడాను'' అని కోహ్లి అన్నాడు. కాగా, మరో రెండు వారాల్లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్లో గొప్పగా రాణించడానికి ప్రయత్నిస్తా అని కోహ్లి తెలిపాడు. తనలో ఉండే కసినే తనని ముందుకు నడిపిస్తుందని చెప్పాడు.