ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు ఇప్పట్లో పెళ్లి చేసుకునేలా కనిపించడం లేదు. అయితే ఈ ప్రేమజంట బయట ఎక్కడ కనపించినా మీడియాలో మాత్రం వివిధ రకాల ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ ప్రేమపక్షులు మంగళవారం ముంబైలోని వర్లీ ప్రాంతంలో ప్రత్యక్షం కావడంతో మరోసారి వార్తల్లో నిలిచారు.
ఓంకార్ బిల్డర్స్ '1973 వర్లీ' పేరుతో నిర్మిస్తున్న అత్యంత విలాసవంతమైన అపార్ట్ మెంట్లను వీరిద్దరూ పరిశీలించారు. ఆకాశాన్ని తాకేలా నిర్మిస్తున్న ఈ అపార్ట్మెంట్లు సిద్ధమైన తర్వాత ఈ జోడీ ఇక్కడిక మకాం మారుస్తారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరికొన్ని మీడియా ఛానెళ్లు ఇంకో అడుగు ముందుకేసి పెళ్లైన తర్వాత ఇక్కడే కాపురం పెడతారని వార్తలను ప్రసారం చేశాయి.

అయితే ఈ వార్తలపై ఈ ప్రేమజంట ఇప్పటివరకు కామెంట్ చేయకపోవడం విశేషం. ఇటీవలే వీరిద్దరూ క్రిస్టమస్, నూతన సంవత్సర వేడుకలను ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రడూన్లో జరుపుకున్న సంగతి తెలిసిందే. అప్పుడు కూడా మీడియా అత్యుత్సాహం చూపించిన సంగతి తెలిసిందే.
చాలా కాలంగా ప్రేమించుకుంటున్న ఈ జోడీ ఉత్తరాఖండ్లోని నరేంద్రనగర్ ఆనందా హోటల్లో ఈ ఇద్దరి నిశ్చితార్థం జరగనున్నట్టు కథనాలు వెలువడ్డాయి. కోహ్లీ-అనుష్క ఎంగేజ్మెంట్కు ప్రముఖులు హాజరవుతారని చెప్పుకున్నారు. మీడియాలో వచ్చిన వార్తలపై కోహ్లి స్వయంగా వివరణ ఇవ్వడంతో ఊహాగానాలకు తెర పడింది.