హైదరాబాద్: విరామంలో ఉన్న విరాట్ కోహ్లీకి ఆహ్వానమొచ్చింది. కొద్ది నెలల ముందే వివాహం చేసుకున్న జంటకు సతీసమేతంగా రమ్మంటూ ఆహ్వానించారు శ్రీలంక మంత్రి.
ప్రపంచ వ్యాప్తంగా విరుష్క జంటకు పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతున్న జాబితాలో ఆయన కూడా చేరిపోయారు.
విరాట్ కోహ్లీ, అతని సతీమణి అనుష్క శర్మ కలిసి తమ దేశంలో హాలీ డే కోసం రావాలని విరాట్కు వీరాభిమాని అయిన పొరుగు దేశం మంత్రి కోరడం విశేషం. విరుష్క జోడీ శ్రీలంక దేశానికి విహారయాత్రకు వచ్చి తమ దేశ పర్యాటక ప్రాంతాలను ఆస్వాదించాలని లంక క్రీడల శాఖ మంత్రి దయాసిరి జయసేఖర కోరారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అసాధారణ ఆటకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులుండటం గర్వించదగ్గ విషయం.
క్రీడల మంత్రి దయాసిరి రాజశేఖర సైతం విరాట్ కోహ్లీకి అతిపెద్ద అభిమాని. గత ఆగస్టులో లంకతో జరిగిన రెండో టెస్టులో స్టేడియానికి వచ్చి మరీ విరాట్ ముచ్చటైన బ్యాటింగ్ను ప్రత్యక్షంగా వీక్షించాడు. ప్రస్తుతం జరుగుతోన్న ముక్కోణపు టీ20 సిరీస్ గురించి మాట్లాడాడు.
ఈ సందర్భంగా ఆయన .. 'కోహ్లీని ఇక్కడ ఆడటానికి రమ్మని ఆహ్వానించట్లేదు. తన భార్య అనుష్క శర్మతో కొద్దిరోజులు తమ దేశంలో సరదాగా గడపాలని కోరుతున్నా. తనకు వివాహం అయిన తరువాత మా దేశాన్ని సందర్శించలేదు. ఈ జంట మా దేశం అతిథి కావచ్చు. ఇక్కడ విహరించేందుకు ఇక్కడ ఎన్నో సుందరమైన ప్రదేశాలున్నాయి' అని దయాసిరి పేర్కొన్నారు.