|
కోహ్లీని ముద్దాడిన అనుష్క:
ఈ ఈవెంట్లో విరాట్ కోహ్లీ క్రికెట్ ప్రయాణానికి సంబంధించిన ఓ వీడియోను ప్రదర్శించారు. అనంతరం స్టేడియంలోని ఓ స్టాండ్కి కోహ్లీ పేరుని పెడుతున్నట్టు ప్రకటించారు. ఆ సమయంలో కోహ్లీ పక్కన కూర్చున్న అనుష్క శర్మ అతని చేతిని ముద్దాడి చాలా ఎమోషనల్ అయింది. వెంటనే కోహ్లీ కూడా భావోద్వేగానికి గురై అనుష్క చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఆపై విరుష్క జంట ఒకరితోఒకరు మాట్లాడుకున్నారు.
నిజమైన ప్రేమ:
ఈ ముద్దుకు సంబందించిన సన్నివేశం కెమెరాలలో రికార్డ్ కాగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను అభిమానులు లైక్ చేస్తూ.. షేర్ చేస్తున్నారు. అంతేకాదు అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'ఇది నిజమైన ప్రేమ' అని ఓ అభిమాని ట్వీట్ చేయగా.. 'ఉత్తమ జంట' అని మరో అభిమాని ట్వీట్ చేసాడు. కోహ్లీ ఈ నెల 15 నుండి దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్ కోసం సిద్ధం అవుతున్నాడు.
కలలో కూడా అనుకోలేదు:
ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ... 'ఇలాంటి అరుదైన గౌరవం నాకు లభిస్తుందని నేను ఎప్పుడూ కలలో కూడా అనుకోలేదు. నా భార్య, కుటుంబ సభ్యుల ముందు ఈ ఆనందాన్ని ఎలా వర్ణించాలో అర్ధం కావడం లేదు' అని భావోద్వేగం చెందారు. '2000 సంవత్సరంలో జింబాబ్వేతో మ్యాచ్ జరిగింది. నా చిన్నప్పటి కోచ్ రాజ్కుమార్ శర్మ రెండు టికెట్లు ఇచ్చారు. వెంటనే నా సోదరుడితో కలిసి మ్యాచ్ చూడటానికి పరుగెత్తా. గ్యాలరీ నుంచి పేసర్ జవగల్ శ్రీనాథ్ ఆటోగ్రాఫ్ అడిగా. ఇప్పుడు ఇదే స్టేడియంలో నా పేరుతో పెవిలియన్ ఉండటం గౌరవంగా ఉంది' అని కోహ్లీ అన్నారు.
ఆటను వేరే స్థాయికి తీసుకెళ్లిపోయాడు:
కపిల్దేవ్ మాట్లాడుతూ... 'కోహ్లీకి ఇంకా చాలా కెరీర్ ఉంది. అతని కెరీర్ మధ్యలో ఉండగా ఎన్ని రికార్డులు బద్ధలు కొడతాడనే దానిపై మాట్లాడటం సరైనది కాదు. సచిన్ తన శకంలో రికార్డులు మోత మోగించాడు. అదొక అద్భుతం. సచిన్ రికార్డులకు చేరువగా ఎవరూ వస్తారని అనుకోలేదు. ఇప్పుడు సచిన్ అత్యధిక సెంచరీల రికార్డుకు విరాట్ చేరువగా వచ్చాడు. అయితే ఆటను కోహ్లీ వేరే స్థాయికి తీసుకెళ్లిపోయాడు' అని అన్నారు.