
చివరి ఓవర్ హైడ్రామా..
ఈ మ్యాచ్ అంతా ఒక ఎత్తయితే.. చివరి ఓవర్లో చోటు చేసుకున్న హైడ్రామా మరో ఎత్తుగా చెప్పుకోవచ్చు. భారత్కు ఘన విజయాన్ని అందించిన ఓవర్ అది. గెలవడానికి భారత్కు చివరి ఓవర్లో 16 పరుగులు చేయాల్సిన దశలో పోరాడింది టీమిండియా. చివరి బంతికి సింగిల్ తీయడం ద్వారా విజయాన్ని ముద్దాడింది. చివరి బంతికి రవిచంద్రన్ అశ్విన్ విన్నింగ్ షాట్ ఆడాడు. దీనితో ఆనందోత్సాహాలు వెల్లి విరిశాయి.
సెలబ్రేషన్స్ హోరు..
అప్పటివరకు ఉన్న టెన్షన్ మొత్తం ఒక్కసారిగా తీరిపోయింది. దాని స్థానంలో సెలబ్రేషన్స్ వచ్చి చేరాయి. మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం మొత్తం హర్షధ్వానాలతో మారుమోగిపోయింది. ఓ సునామీలా ఆనందోత్సహాలు విరుచుకుపడ్డాయి. లక్షమందికి పైగా అభిమానుల సందడి- పోటెత్తిన సముద్రాన్ని తలపించింది. ఎటు చూసిన త్రివర్ణ పతాకాలు కనిపించాయి. అప్పుడే ఫైనల్స్ ముగిసినట్లుగా - టీమిండియా టీ20 ప్రపంచకప్ 2022 ఛాంపియన్గా భారత్ ఆవిర్భవించినట్లు సంబరాలు చేసుకున్నారు అభిమానులు.

మాజీలూ అదే దారి..
స్టేడియంలో కూర్చుని మ్యాచ్ను ప్రత్యక్షంగా తిలకిస్తోన్న మాజీ క్రికెటర్లు, లెజెండర్లు కూడా దీనికి మినహాయింపు కాదు. 20వ ఓవర్ చివరి బంతికి రవిచంద్రన్ అశ్విన్ విన్నింగ్ షాట్ కొట్టగానే- మాజీ క్రికెటర్లు ఎగిరి గంతులేశారు. గట్టిగా చప్పట్లు కొడుతూ చిందులు తొక్కారు. ఆ క్షణంలో చిన్నపిల్లల్లా మారిపోయారు. అప్పటివరకు నరాలు తెగే ఉత్కంఠతను అనుభవిస్తూ, సీట్ ఎడ్జ్లో కూర్చుని మ్యాచ్ చూసిన ఫ్యాన్స్- ఇక ఉండబట్టలేకపోయారు. సెలబ్రేషన్స్తో స్టేడియాన్ని హోరెత్తించారు.

సునీల్ గవాస్కర్ చిన్నపిల్లాడిలా..
మాజీ డాషింగ్ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్, మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి, మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. చివరి బంతికి లేచి నిల్చున్నారు. అశ్విన్ ఆడిన విన్నింగ్ షాట్ ఆడగానే ఎగిరి గంతులేశారు. ప్రత్యేకించి- లెజెండరీ బ్యాటర్ సునీల్ గవాస్కర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తలకు మంకీ క్యాప్ ధరించిన సునీల్ గవాస్కర్- విన్నింగ్ షాట్ ఆడగానే చిందులు తొక్కాడు. రెండు చేతులు పైకెత్తి డాన్స్ చేస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.


Click it and Unblock the Notifications
