ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (92; 47 బంతుల్లో, 7x4, 6x6) విశ్వరూపం చూపించాడు. సొగసైన బౌండరీలు, ముచ్చైటన సిక్సర్లతో అలరించాడు. కానీ విరాట్ తృటిలో సెంచరీ కోల్పోయాడు. అర్షదీప్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి బౌండరీ లైన్లో రొసో చేతికి చిక్కాడు.
ఐపీఎల్లో 90+ స్కోరు సాధించి కోహ్లి సెంచరీ చేజార్చుకోవడం ఇది రెండో సారి. 2013లో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో కోహ్లి 99 పరుగుల వద్ద ఔటయ్యాడు. 11 ఏళ్ల తర్వాత లీగ్లో కోహ్లి మరోసారి 90+ పరుగుల వద్ద ఔటయ్యాడు. అయితే ఈ మ్యాచ్లో కోహ్లి ఆరు సిక్సర్లు బాదాడు. కవెరప్ప బౌలింగ్లో ఒంటి చేత్తో, సామ్ కరన్ వేసిన స్లో బంతిని మోకాలిపై కూర్చొని బాదిన సిక్సర్లు హైలైట్గా నిలిచాయి.

కవెరప్ప వేసిన ఏడో ఓవర్ తొలి బంతిని కోహ్లి ఒంటి చేత్తో స్టాండ్స్కు తరలించడం విశేషం. అయితే అంతకుముందు అరంగేట్ర బౌలర్ కవరప్ప బౌలింగ్లో కోహ్లి ఔటయ్యే ప్రమాదం నుంచి రెండు సార్లు బయటపడ్డాడు. ఖాతా తెరవకుముందు, 10 పరుగుల స్కోర్ వద్ద కోహ్లికి రెండు సార్లు లైఫ్ లభించింది.
మొదటి ఓవర్లో కోహ్లి షాట్కు యత్నించి గాల్లోకి బంతిని లేపాడు. వెనక్కి పరిగెత్తుతూ అశుతోష్ దాన్ని అందుకోలేకపోయాడు. మూడో ఓవర్ ఆఖరి బంతికి కవరప్ప కోహ్లిని ఔట్ చేయడానికి అవకాశం కల్పించాడు. కానీ ఈ సారి రొసో క్యాచ్ను నేలపాలు చేశాడు. షార్ట్ కవర్లో ఉన్న రొసో గాల్లోకి డైవ్ చేస్తూ క్యాచ్ అందుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆ తర్వాత కోహ్లి వెనుదిరిగి చూడలేదు. కోహ్లితో పాటు రజత్ పటిదార్ (55; 23 బంతుల్లో, 3x4, 6x6), కామెరూన్ గ్రీన్ (46; 27 బంతుల్లో, 5x4, 1x6) కూడా రాణించడంతో ఆర్సీబీ 241 పరుగుల చేసింది.