
నేడు జరగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ గురించి ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ఇక పాక్ అభిమానులేమో.. ఇండియాకు ఈసారి పాక్ ఓటమి రుచి చూపిస్తుందంటుండగా.. భారత అభిమానులేమో మరో ఓటమికి సిద్ధంకండి అంటూ నెట్టింట పోస్టుల పర్వాన్ని వెల్లడిస్తున్నారు. ఇకపోతే సెలెబ్రెటీలకు, మాజీ క్రికెటర్లకు కూడా ఎవరు గెలుస్తారనే విషయమై క్వశ్చన్ల పర్వం ఎదురవుతూనే ఉంది. తాజాగా ఈ మ్యాచ్ రిజల్ట్ ఎలా ఉంటుంది. ఎవరు గెలుస్తారని మాజీ భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ను పాకిస్థాన్ అభిమాని మోమిన్ సాకిబ్ అడగగా.. పఠాన్ అదిరిపోయే ఆన్సరిచ్చాడు. మోమిన్ సాకిబ్ 'మారో ముఝే మారో' అనే వీడియోతో సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అయిపోయిన సంగతి తెలిసిందే.
మోమిన్ సాకిబ్ ఇర్ఫాన్ను భాయ్ మీ ఆటకు నేను చాలా అభిమానిని.. తాజాగా జరగబోయే ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ఫలితం ఎలా ఉంటుంది..? మీరేమనుకుంటున్నారు అని అడగ్గా.. పఠాన్ ఏమాత్రం సంకోచం వహించగా.. పోయినవారం ఏం జరిగిందో ఈ వారం కూడా అదే జరుగుతుంది.. (రిపీట్ హీ హోగా) అంటూ ఆన్సరిచ్చాడు. పఠాన్ సమాధానాన్ని విన్న మోమిన్.. 2021 టీ20 ప్రపంచకప్లో పాకిస్తాన్ గెలుపొందడాన్ని ప్రస్తావిస్తూ మీరు ఆన్సరిచ్చారా.. అంటూ మోమిన్ కాస్త వ్యంగ్యంగా అడిగాడు. ఇక పఠాన్ నవ్వుతూ నువ్వు నన్నడిగావ్ కదా.. నేను ఏం అనుకుంటున్నానో అది రిపీట్ అవుతుంది అంటూ కౌంటరిచ్చాడు. ఇక ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది. 2021 టీ20 ప్రపంచకప్ టైంలో ఇండియా పాక్ చేతిలో ఓడిపోగా.. మొన్న ఆసియాకప్ తొలి మ్యాచ్లో ఇండియా గెలిచిన సంగతి తెలిసిందే. పఠాన్ ఆన్సర్ బట్టి ఇండియాదే విజయం అని చెప్పేశాడు.
ప్రస్తుతం ఆసియా కప్ రసవత్తరంగా సాగుతుంది. తొలి మ్యాచ్లో భారత్ తీవ్ర ఉత్కంఠ నడుమ పాకిస్థాన్ను ఓడించింది. హార్దిక్ పాండ్యా వీరోచిత ఇన్నింగ్స్ భారత్ను విజయ గీత దాటించింది. ఇక ఆ మ్యాచ్ కంటే మరింత నిఖార్సైన విజయాన్ని భారత్ ఈసారి పాక్ మీద నమోదు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇకపోతే భారత్కు ఈ మ్యాచ్ ముందు పెద్ద దెబ్బ తగిలింది. తొలి మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా జట్టుకు మోకాలి గాయం కారణంగా దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో అక్షర్ పటేల్ బరిలోకి దిగే అవకాశముంది. ఇక తుది జట్టు ఎంపిక ఎలా ఉంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. పంత్ వర్సెస్ దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్ వర్సెస్ దీపక్ హుడా, అవేశ్ ఖాన్ వర్సెస్ రవిబిష్నోయ్ మధ్య ఎవరికీ చోటు దక్కుతుందనే విషయంలో చాలా ఉత్కంఠ నెలకొంది. ఇక ఈ మ్యాచ్ గెలిస్తే భారత్ ఫైనల్ చేరడానికి అతి పెద్ద స్టెప్ వేసినట్టవుతుంది.