హైదరాబాద్: బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి.. సుప్రీంకోర్టు నియమిత పరిపాలన కమిటీ (సీవోఏ) వినోద్ రాయ్పై అసహనం వ్యక్తం చేశాడు. జస్టిస్ లోధా సిఫారసులను అమలు చేయడంలో రాయ్ పూర్తిగా విఫలమయ్యాడని ఆరోపించాడు. చాలాకాలంగా అమితాబ్తో పాటు కోశాధికారి అనిరుధ్ చౌదురిని పక్కనబెట్టిన సీవోఏ కీలక అంశాలను వీళ్లతో చర్చించడం లేదు. దీనికి తోడు వీళ్లను తొలగించాలని ఇంతకుముందే రాయ్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి కూడా చేశాడు.
ఈ నేపథ్యంలో రాయ్ తీసుకున్న నిర్ణయాలపై అమితాబ్ బహిరంగంగా విమర్శలు చేసేందుకు పూనుకున్నాడు. రాయ్ విషయంలో ఓ అభిప్రాయానికి వచ్చా. దురదృష్టమేమిటంటే ఏడాదిన్నరగా అతను ఈ మెయిల్స్ రాయడానికే పరిమితమయ్యాడు. అంతకుమించి అతను సాధించిందేమీ లేదు. సిఫారసులు అమలు చేయమని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా వాటిని ఇంతవరకు అమలు చేయలేకపోయాడు.
ఈ విషయంలో రాయ్ బృందం పూర్తిగా విఫలమైంది. ఆఫీస్ బేర్లర్లను తొలిగించడానికి రాయ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే అతని వైఫల్యాన్ని మేం ప్రశ్నిస్తామనే భయం మొదలైంది. నియామకాలు జరపడంలో రాయ్ బిజీగా ఉన్నాడు. ఇక మిగతా విషయాలేమి పట్టించుకుంటాడు అని అమితాబ్ పేర్కొన్నాడు. బీసీసీఐ రాజ్యాంగాన్ని సవరించేందుకు అవసరమైన తుది తీర్పును వెల్లడించడంలో సుప్రీంకోర్టు కాలాయపన చేస్తుందని ఇటీవల రాయ్ చేసిన విమర్శలపై కూడా అమితాబ్ తీవ్రంగా ధ్వజమెత్తాడు.
అత్యున్నత న్యాయస్థానం గురించి రాయ్ అలా ఎలా మాట్లాడతారని విమర్శించాడు. నాలుగు దశాబ్దాలుగా ప్రభుత్వంలో పని చేసిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా అంటూ విరుచుకుపడ్డాడు. రోజువారి భత్యం విషయంలో క్రికెర్లతో ముడిపెట్టి తమను ఘోరంగా అవమానించాడని గుర్తు చేశాడు.