

హైదరాబాద్: పార్లమెంట్లో శుక్రవారం అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగం ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్రమోడీ వద్దకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆలింగనం చేసుకున్న సంగతి తెలిసిందే.
పార్లమెంట్లో తన ఆవేశపూరిత ప్రసంగం, చర్యలతో రాహుల్ గాంధీ ఇప్పుడు అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఈ క్రమంలో పార్లమెంట్ చరిత్రలోనే అరుదైన ఘట్టానికి తెరతీశారు. దీంతో ప్రధాని మోడీని రాహుల్ గాంధీ అలింగనం చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లి ట్విట్టర్ వేదికగా స్పందించాడు. "పార్లమెంట్లో రాహుల్ గాంధీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. ఎంతో నిజాయితీగా మాట్లాడారు. మీరు మోడీజీని హగ్ చేసుకున్నారు. ఇదొక చారిత్రాత్మక ఘట్టం. చివరకు గౌరవంగా ముగించారు" అని ట్విట్టర్లో పేర్కొన్నాడు.
2009లో రాజకీయాల్లోకి చేరిన వినోద్ కాంబ్లి ముంబైలోని విక్రోలి నుంచి లోక్ భారతి పార్టీ తరుపున పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత ప్రజలకు చేరువయ్యేందుకు గాను సామాజిక సేవ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే క్రికెటర్లలో వినోద్ కాంబ్లి ఒకడు.
పార్లమెంట్లో రాహుల్ చర్య హాట్ టాపిక్గా మారింది. సభలో ఉన్న సభ్యులందర్నీ షాక్కు గురిచేసింది. ఆ చర్య తర్వాత కెమెరాలన్నీ రాహుల్ వైపే తిరిగాయి. ప్రసంగం ముగించిన రాహుల్.. తన సీట్లో కూర్చున్న తర్వాత కూడా ముసిముసి నవ్వులు, తనవైన హావభావాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
'నాపై మీకు విపరీతమైన ద్వేషం ఉండొచ్చు. నన్ను మీరు పప్పూ అని.. ఇంకా అనేక పదాలతో దూషించవచ్చు. కానీ, మీపై నాకు ఎలాంటి ద్వేషం లేదు' అని మోదీ, అమిత్ షాను ఉద్దేశించి రాహుల్ అన్నారు. అనంతరం నేరుగా ప్రధాని వద్దకెళ్లి ఆలింగనం చేసుకున్నారు. ఈ ఉదంతంతో లోక్ సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి.
అంతకముందు తన ప్రసంగంలో ప్రధాని మోడీ, బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు రాహుల్. మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా భిన్నమైన రాజకీయవేత్తలు అని అన్నారు. 'ఆ ఇద్దరూ మన లాంటి వాళ్లు కాదు.. గెలవడం ఓడిపోవడాన్ని మనం స్వాగతిస్తాం, కానీ ఆ ఇద్దరూ అధికారాన్ని కోల్పోవడాన్ని సహించరు. అధికారం పోతుందన్న భయం వారిలో ఉంది. ఆ భయం ఆగ్రహంగా మారి దాడులు జరుగుతున్నాయి' అని రాహుల్ విమర్శించారు.
'నిజాలకు ఎందుకు బెదిరిపోతున్నారు. ప్రధాని మాట్లాడరు.. దాడులు చేసినవారికి మోదీ సర్కారులో దండలు వేస్తారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్నే మార్చాలని చూస్తున్నారు. పార్లమెంట్పైనే ఆక్రమణ జరుగుతోంది. బీజేపీ, ఆరెస్సెస్ చర్యలతో దేశ ప్రజలు విసిగిపోతున్నారు' అని రాహుల్ అన్నారు.