
హైదరాబాద్: టీమిండియా సీనియర్ బౌలర్, కర్ణాటక సీమర్ ఆర్ వినయ్ కుమార్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్తో పాటు ఫస్ట్క్లాస్ క్రికెట్కు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా శుక్రవారం తెలిపాడు. చాలా కాలంగా వినయ్ కుమార్కు భారత జట్టులో చోటు దక్కకపోయినా.. దేశవాళీ క్రికెట్లో ఆడుతూ వచ్చాడు. చివరకు ఈ రోజు రెండు దశాబ్దాల కెరీర్కు ముగింపు పలికాడు. ఈ సందర్భంగా తనకు అండగా నిలిచిన వాళ్లకు ధన్యవాదాలు తెలిపాడు. వినయ్ మీడియం పేసర్ అన్న విషయం తెలిసిందే.
వినయ్ కుమార్ టీమిండియా తరపున 2010లో అరంగేట్రం చేశాడు. భారత్ తరపున 31 వన్డేల్లో 38 వికెట్లు, 9 టీ20ల్లో 10 వికెట్లు పడగొట్టాడు. ఇక ఒక్క టెస్టు మ్యాచ్ ఆడి ఒక వికెట్ తీశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 2014లో కోల్కతా నైట్రైడర్స్ తరపున ఐపీఎల్లో పాల్గొన్న వినయ్ కుమార్.. ఆ తర్వాత ముంబై ఇండియన్స్కు ఆడాడు. మొత్తం ఐపీఎల్లో 105 మ్యాచ్లాడి 105 వికెట్లు తీశాడు.
37 ఏళ్ల వినయ్ కుమార్ భారత్ తరఫున మొదటగా టీ20 జట్టులో ఆరంగేట్రం చేశాడు. 2010, మే 11న శ్రీలంకపై తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. అదే నెల 28న వన్డేలోకి ఎంట్రీ ఇచ్చాడు. 2012, జనవరి 13న ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. 2013లో చివరి వన్డే ఆడాడు. 2018లో చివరిగా ఐపీఎల్ ఆడాడు. అతడు ఇన్నేళ్లుగా దేశవాళీ క్రికెట్లో ఆడుతూ వచ్చాడు. వినయ్ కుమార్ సారధ్యంలో కర్ణాటక జట్టు 2013-14, 2014-15 రంజీ ట్రోపీ టైటిల్స్ను సాధించింది. కర్ణాటకలోని దావంగిరి జిల్లాలో అతడు జన్మించాడు.
'రిటైర్మెంట్ అనే పదం వినడానికి బాధగా ఉన్నా.. ప్రతీ ఒక్కరు ఏదో ఒక దశలో కెరీర్కు గుడ్బై చెప్పాల్సిందే. నా రిటైర్మెంట్కు ఇదే సరైన సమయమని భావిస్తున్నా. ఈ రోజుతో నా ఫస్ట్క్లాస్ కెరీర్తో పాటు అంతర్జాతీయ క్రికెట్కు ముగింపు పలుకుతున్నా. టీమిండియా తరపున అంతర్జాతీయ జట్టుకు ఆడడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, ఎంఎస్ ధోనీ, గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, రోహిత్ శర్మ లాంటి ఆటగాళ్లతో ఆడడం నా అదృష్టం. ఇన్నాళ్లు మీరిచ్చిన మద్దతుకు నా ధన్యవాదాలు' అని వినయ్ కుమార్ తన ట్వీట్లో పేర్కొన్నాడు.