
హైదరాబాద్: భారత జట్టులో తిరిగి చోటు దక్కించుకోవడమే తన ధ్యేయమని ఇటీవలే వ్యాఖ్యలు చేసిన భారత వెటరన్ పేసర్ ఆర్ వినయ్ కుమార్ రంజీ టోర్నీలో సత్తా చాటుతున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 100వ మ్యాచ్ ఆడుతున్న ఈ కర్ణాటక రంజీ జట్టు కెప్టెన్ హ్యాట్రిక్ వికెట్లతో పాటు ఆరు వికెట్లు తీసి సత్తా చాటాడు.
రంజీ ట్రోఫీలో భాగంగా నాలుగో కార్టర్ ఫైనల్లో గురువారం ముంబై-కర్ణాటక జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కర్ణాటక ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు దిగిన ముంబై బ్యాట్స్మెన్కు వినయ్ కుమార్ చుక్కలు చూపించాడు.
రెండు ఓవర్ల వ్యవధిలోనే వినయ్ కుమార్ హ్యాట్రిక్ వికెట్లు తీయడం విశేషం. తొలి ఓవర్ చివరి బంతికి ముంబై స్టార్ ఆటగాడు పృథ్వీ షా స్లిప్లో ఉన్న కరుణ్ నాయర్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత మూడో ఓవర్ మొదటి బంతికి జోయ్ గోకుల్ బిస్తాను పెవిలియన్కు పంపాడు.
పృథ్వీ షా ఏదైతే తప్పు చేశాడో అదే తప్పుని జోయ్ గోకుల్ బిస్తా చేయడం విశేషం. జోయ్ గోకుల్ బిస్తా కూడా కరుణ్ నాయర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాతి బంతికే ఆకాశ్ పర్కకర్ను ఎల్బీగా ఔటయ్యాడు. దీంతో తన 100వ ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో వినయ్ కుమార్ హ్యాట్రిక్ నమోదు చేశాడు.
ఆ తర్వాత సిద్ధేశ్ లాడ్, అఖిల్ హరిద్వార్, సూర్యకుమార్ యాదవ్లను వినయ్ కుమార్ ఔట్ చేశాడు. వినయ్ కుమార్ అద్భుత ప్రదర్శనతో ముంబై తన తొలి ఇన్నింగ్స్లో 173 పరుగులకే ఆలౌటైంది. ముంబై జట్టులో ధావల్ కులకర్ణి(75) టాప్ స్కోరర్గా నిలిచాడు. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ధావల్ రాణించడంతో ముంబై ఈ మాత్రం పరుగులన్నా చేసింది.