
హైదరాబాద్: టీమిండియా నూతన బ్యాటింగ్ కోచ్గా విక్రమ్ రాథోర్ ఎంపికయ్యారు. బౌలింగ్ కోచ్గా భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్గా ఆర్.శ్రీధర్కే బీసీసీఐ పట్టం కట్టింది. ఈ మేరకు ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్లో ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ గురువారం అధికారిక ప్రకటన చేసింది.
వీరంతా 2021 టీ20 వరల్డ్కప్ వరకు ఆయా పదవుల్లో కొనసాగనున్నారు. టీమిండియా సహాయక సిబ్బంది నియామకం కోసం ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలు గురువారంతో ముగిశాయి. చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, సరన్దీప్ సింగ్, గంగన్ ఖోడా, జతిన్ పారాజపే పాల్గొనగా.. మరో సభ్యుడు దేవాంగ్ గాంధీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
కాగా, గతవారం క్రికెట్ సలహా కమిటీ ఆధ్వర్యంలో ప్రధాన కోచ్ రవిశాస్త్రి తిరిగి ఎంపికైన సంగతి తెలిసిందే. బ్యాటింగ్ కోచ్గా సంజయ్ బంగర్ దరఖాస్తు చేసుకున్నా అతడు ఇంటర్వ్యూల్లో రెండో స్థానంలో నిలిచాడని బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ చెప్పారు. తొలి స్థానంలో విక్రమ్ రాథోర్, మూడో స్థానంలో ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్మన్ మార్క్ రామ్ప్రకాశ్ నిలిచారు.
టీమిండియా నాలుగో స్థానంలో సరైన బ్యాట్స్మెన్ను తీర్చిదిద్దడంలో సంజయ్ బంగర్ విఫలమైన సంగతి తెలిసిందే. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్కప్లో న్యూజిలాండ్తో జరిగిన తొలి సెమీస్లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ఏడో స్థానంలో పంపడంపై అప్పట్లో బంగర్పై తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఇదే అతడి పదవికి ఎసరు పెట్టిందని తెలుస్తోంది. ఇక, భారత జట్టు ఫిజియో స్థానం కోసం దరఖాస్తు చేసుకున్న 16 మందిని బుధవారం ఇంటర్వ్యూ చేయగా... ఫిట్నెస్ ట్రైనర్ పదవి కోసం 12 మందిని కమిటీ ఇంటర్యూ చేసింది. ఫిజియోగా నితిన్ పటేల్ను కమిటీ ఎంపిక చేసింది. ఇక, సునీల్ సుబ్రమణియమ్ స్థానంలో జట్టు మేనేజర్గా గిరీష్ డోంగ్రేను ఎంపికయ్యాడు.