హైదరాబాద్: భారత బాక్సర్లలో వికాస్ కిషన్ టాపర్గా ఈ ఏడాదిని ముగించాడు. ఇటీవల అంతర్జాతీయ వేదికలపై అద్భుతంగా రాణిస్తున్న భారత బాక్సర్లు ప్రపంచ ర్యాంకింగ్స్లోనూ దూసుకెళుతున్నారు. అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య (ఏఐబీఏ) తాజాగా ప్రకటించిన ప్రపంచ ర్యాంకింగ్స్లో వికాస్ కిషన్కి 75 కిలోల విభాగంలో నాలుగో స్థానం దక్కింది.
భారత బాక్సర్లకు దక్కిన ర్యాంకింగ్స్లో వికాస్ కిషన్దే అత్యుత్తమమైనదికాగా, శివ తాపా 56 కిలోల విభాగంలో ఏడో స్థానంలో నిలిచాడు. ఆసియా క్రీడల మాజీ స్వర్ణ పతక విజేత అయిన వికాస్ కిషన్ 75 కిలోల విభాగంలో 1350 పాయింట్లు సాధించి ప్రపంచ ర్యాంకుల్లో 4వ ర్యాంక్కు ఎగబాకాడు.
రియో ఒలింపిక్స్లో వికాస్ క్వార్టర్ ఫైనల్స్కు చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఏడాది ఏఐబీఏ నుంచి ఉత్తమ ప్రో బాక్సర్ అవార్డు కూడా అందుకున్నాడు. కాగా, వికాస్ కిషన్, శివ తాపాలతో పాటు మహిళల్లో స్వీటీ బూరాలు అత్యుత్తమ ర్యాంకుల్లో నిలిచారు.
56 కిలోల కేటగిరీలో మాజీ ఆసియా చాంపియన్, ప్రపంచ చాంపియన్షిప్ కాంస్య పతక విజేత అయిన శివ తాపా 7వ ర్యాంకుని సొంతం చేసుకున్నాడు. ఇక దేవేంద్రోసింగ్ (49 కి) 27వ ర్యాంకులో నిలువగా, కామన్వెల్త్ క్రీడల విజేత మనోజ్ కుమార్ (64 కి) 36వ ర్యాంకును దక్కించుకున్నాడు.
మహిళల 81 కిలోల విభాగంలో స్వీటీ 1500 పాయింట్లతో 2వ ర్యాంకుని సొంతం చేసుకోవడం వవిశేషం. సర్జూబాల దేవి (48కి), సోనియా లాథర్ (57కి)లు తమ విభాగాల్లో 3వ ర్యాంక్ని సాధించారు. తెలంగాణ యువ మహిళా బాక్సర్ నిఖత జరీన్ ఫ్లై వెయిట్ (54 కిలోలు) విభాగంలో ఏఐబీఏ ర్యాంకింగ్స్లో 16వ ర్యాంక్ సాధించింది.