న్యూఢిల్లీ: భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్సింగ్ చరిత్ర సృష్టించాడు. తన ప్రొఫెషనల్ కెరీర్లో అతిపెద్ద టైటిల్ డబ్ల్యూబీవో ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్వెయిట్ ఛాంపియన్షిప్ సాధించాడు.
ఢిల్లీలోని త్యాగరాజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఆస్ట్రేలియా ప్రొబాక్సర్, మాజీ యురోపియన్ ఛాంపియన్ కెర్రీహోప్తో జరిగిన ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ ఛాంపియన్షిప్లో ఘన విజయం సాధించాడు.
ప్రొ బాక్సింగ్లో అరంగేట్రం నుంచి ఓటమి ఎరగకుండా అదరగొడుతున్న విజేందర్కు వరుసగా ఇది ఏడో విజయం. దేశంలో జరిగిన అతిపెద్ద ప్రొ బౌట్లో విజేందర్ అన్ని రౌండ్లలోనూ ఆధిక్యం కనబరిచాడు. కెర్రీహోప్పై 98-92, 98-92, 100-90 తేడాతో గెలుపొందాడు.

కాగా, టైటిల్ సాధించిన తర్వాత విజేందర్ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ విజయం తనది కాదని భారతదేశానిదని తెలిపాడు. బౌట్ చూసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు.
కెర్రీ చాలా బాగా ఫైట్ చేశాడని కొనియాడాడు. అయితే, చివరికి తననే విజయం వరించిందని చెప్పాడు. కాగా, ఈ బౌట్ చూసేందుకు క్రికెటర్లు యువరాజ్సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీతోపాటు పలువురు ప్రముఖులు వచ్చారు. మరికొందరు క్రికెట్ ప్రముఖులు సోషల్ మీడియాలో విజేందర్కు అభినందనలు తెలియజేశారు.