అందు కోసమే ఎదురుచూస్తున్నా..
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022లో రాణించిన వారికి ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కే అవకాశాలు ఉంటాయని టీమిండియా యువ ఓపెనర్ శుభ్మాన్ గిల్ అభిప్రాయపడ్డాడు. ఈ సీజన్లో బాగా ఆడి రానున్న టీ20 ప్రపంచకప్ను టీమిండియాలో చోటు సంపాదించాలని తాను కూడా ఎదురుచూస్తున్నట్లు ఈ యువ ఓపెనర్ తెలిపాడు. ఇక ఐపీఎల్ 15లో టైటిల్ గెలిచే సత్తా అన్ని జట్లకు ఉందని గిల్ అభిప్రాయపడ్డాడు. అయితే సునామీల దూసుకొచ్చిన గుజరాత్ టైటాన్స్ ఈ సారి టైటిల్ గెలుస్తుందని జోస్యం చెప్పాడు. కాగా శుభ్మన్ గిల్ కూడా గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడనున్న సంగతి తెలిసిందే.
ఐపీఎల్ ట్రోఫీ గెలుస్తాం
తమ జట్టులో సత్తా ఉన్న బ్యాటర్లు, ఆల్రౌండర్లు, బౌలర్లు ఉన్నారని చెప్పిన గిల్.. మైదానంలో తమ ప్రణాళికలను సరిగ్గా అమలు చేస్తే ట్రోఫీ గెలవడం పెదగా కష్టమేమి కాదని అన్నాడు. ప్రస్తుతం జట్టు సభ్యులంతా ప్రాక్టీస్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నట్లు చెప్పాడు. తొలి సారి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఆటగాళ్లకు స్వేచ్ఛనిచ్చాడని, మైదానంలో తమ ఇష్టం వచ్చినట్లు ఆడమని చెప్పినట్లు పేర్కొన్నాడు. ఒక కెప్టెన్ నుంచి ఇంతకంటే ఏమి ఆశించలేమని మైదానంలోనూ ఇదే స్వేచ్చ ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఇక తమ గుజరాత్ టైటాన్స్ టీంకు బలమైన కోచింగ్ స్టాఫ్ ఉన్నట్లు శుభ్మన్ గిల్ చెప్పుకొచ్చాడు.
గిల్ రికార్డులు
ఐపీఎల్లో ఇప్పటివరకు 58 మ్యాచ్లాడిన 22 ఏళ్ల శుభ్మాన్ గిల్ 31 సగటుతో 1417 పరుగులు చేశాడు. ఇందులో 10 హాఫ్ సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోర్ 76 పరుగులుగా ఉంది. ఈ క్రమంలో 123 స్ట్రైక్రేట్తో బ్యాటింగ్ చేసిన గిల్ 137 ఫోర్లు, 36 సిక్సులు బాదాడు. అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా తరఫున 10 టెస్టు మ్యాచ్లాడిన శుభ్మాన్ గిల్ 32 సగటుతో 558 పరుగులు చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోర్ 91 పరుగులుగా ఉంది. ఇక 3 వన్డే మ్యాచ్ల్లో 39 పరుగులు చేశాడు.
గుజరాత్ టైటాన్స్ పూర్తి జట్టు
హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుభ్మన్ గిల్, మహ్మద్ షమీ, జాసన్ రాయ్, లాకీ ఫెర్గూసన్, అభినవ్ సదరంగాని, రాహుల్ తెవాటియా, నూర్ అహ్మద్, సాయి కిషోర్, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, డొమినిక్ డ్రేక్స్, దర్శన్ నల్కండే, యశ్రీ జోసెఫ్ దయాల్, ప్రదీప్ జోసెఫ్ దయాల్, డేవిడ్ మిల్లర్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, వరుణ్ ఆరోన్, బి సాయి సుదర్శన్.