హైదరాబాద్: టీమిండియా సీనియర్ ఓపెనర్ మురళీ విజయ్ ఇంగ్లండ్లోని కౌంటీ క్రికెట్లో బరిలోకి దిగనున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలోనే ఉన్న మురళీ విజయ్ పేలవ ప్రదర్శన కనబరుస్తుండటంతో ఇంగ్లిష్ కౌంటీల బాట పట్టాడు. కౌంటీ చాంపియన్షిప్లో భాగంగా ఎసెక్స్ తరఫున విజయ్ ఆఖరి దశ మ్యాచ్లు ఆడబోతున్నాడని బీసీసీఐ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది.
మరోవైపు ఎసెక్స్ జట్టు తమ అధికారిక వెబ్సైట్ సైతం మురళీ విజయ్ చేరికను ధృవీకరించింది. కౌంటీ క్రికెట్లో భాగంగా ఎస్సెక్స్ కౌంటీ తరఫున అతను మూడు 4 రోజుల మ్యాచ్లు ఆడనున్నాడు. సెప్టెంబర్ 10 నుంచి ట్రెంట్బ్రిడ్జ్ వేదికగా నాటింగ్హామ్షైర్తో జరిగే నాలుగు రోజుల మ్యాచ్లో మురళీ విజయ్ బరిలోకి దిగనున్నాడు.
ఆ తర్వాత 18 నుంచి సొంతగడ్డ వోర్సెస్టర్షైర్తో రెండో మ్యాచ్, 24 నుంచి సర్రేతో మూడో మ్యాచ్లో విజయ్ బరిలోకి దిగుతాడని ఎసెక్స్ యాజమాన్యం పేర్కొంది. ఇంగ్లాండ్ పర్యటనలో ఫామ్లో లేక సతమతమవుతున్న మురళీ విజయ్కి బీసీసీఐ కౌంటీ క్రికెట్లో ఆడేలా ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా మురళీ విజయ్ మాట్లాడుతూ "గత నెల రోజులుగా ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా భారత్ జట్టులో సభ్యునిగా ఉన్నాను. ఇక్కడ ఆడటాన్ని బాగా ఆస్వాదించాను. కానీ పరుగుల వేటలో విఫలమై జట్టులో చోటు కోల్పోయాను. పిచ్లపై మరింత అవగాహన కోసం కౌంటీల్లో ఎసెక్స్ తరఫున ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా" అని చెప్పాడు.
🇮🇳👋@mvj888 pic.twitter.com/RpuTpq2dnd
— Essex Cricket (@EssexCricket) September 8, 2018