విజయ్ శంకర్..కేదార్ జాదవ్ మనకు అవసరమా?
కెఎన్ రాహుల్ పెవిలియన్ దారి పట్టిన తరువాత వచ్చిన విజయ్ శంకర్ మరోసారి నిరాశ పరిచాడు. ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్ తరహాలోనే ఇక్కడా భారీ స్కోరును చేయలేకపోయాడు. 19 బంతుల్లో మూడు ఫోర్లతో 14 పరుగులు మాత్రమే చేశాడు. కీమర్ రోచ్ బౌలింగ్లో వికెట్ కీపర్ షై హోప్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తరువాత బ్యాటింగ్కు దిగిన కేదార్ జాదవ్ సైతం అభిమానులను నిరాశకు గురి చేశాడు. మరీ ఏడు పరుగులకే వెనుదిరిగాడు. 10 బంతులను ఎదుర్కొన్న కేదార్ జాదవ్ ఒక ఫోర్ కొట్టాడు. కీమర్ రోచ్ బౌలింగ్లోనే వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు.
వరుసగా రెండు మ్యాచుల్లో..
ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్లో కేదార్ జాదవ్ సైతం ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాడు. మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి భారీ ఇన్నింగ్ను నిర్మించినప్పటికీ.. మందకొడిగా ఆడాడనే ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు కేదార్ జాదవ్. 69 బంతుల్లో 52 పరుగులు చేశాడు కేదార్. అయినప్పటికీ.. ఆఫ్ఘనిస్తాన్ వంటి జట్టుపై ఆడాల్సిన శైలి అది కాదంటూ అభిమానులు, నెటిజన్లు, ట్విట్టరెట్టీలు మాత్రమే కాదు.. క్రికెట్ విశ్లేషకులు సైతం తప్పు పట్టారు. క్రికెట్ లెజెండరీ సచిన్ టెండుల్కర్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఈ ఇద్దర్నీ పక్కన పెట్టి..
ప్రపంచకప్ వంటి మెగా టోర్నమెంట్లో భారత క్రికెట్ జట్టు ప్రయోగాలకు దిగ కూడదని అభిప్రాయపడుతున్నారు అభిమానులు. టీమ్ మేనేజ్మెంట్కు హితవు పలుకుతున్నారు. వరుసగా రెండు మ్యాచుల్లో విఫలమైన విజయ్ శంకర్, కేదార్ జాదవ్లను పక్కన పెట్టాలని సూచిస్తున్నారు. బలమైన ఇంగ్లండ్తో జరిగే మ్యాచ్ సందర్భంగా ఈ ఇద్దర్నీ తుది జట్టులోకి తీసుకోవద్దని అంటున్నారు. విజయ్ శంకర్, కేదార్ జాదవ్లకు బదులుగా రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజాలను ఆడించాలని పట్టుబడుతున్నారు. బ్యాటింగ్, ఫీల్డింగ్లల్లో వారిద్దరూ మెరుగ్గా రాణించగలుగుతారని చెబుతున్నారు. ఇదే జట్టుతో ఇంగ్లండ్తో ఆడితే కష్టాలు తప్పవని జోస్యం చెబుతున్నారు.