
హైదరాబాద్: శ్రీలంకలో జరిగే ముక్కోణపు టీ20 సిరిస్కు గాను సీనియర్ క్రికెటర్లకు విశ్రాంతి ఇచ్చిన సెలక్టర్లు తమిళనాడుకు చెందిన యువ క్రికెటర్ విజయ్ శంకర్కు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా స్థానంలో చోటు దక్కించుకున్న విజయ్ శంకర్ తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటానని అన్నాడు.
'సెలక్టర్ల నుంచి పిలుపు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇది నిజంగా సర్ప్రైజ్. నాకు ఏదైతే అవకాశం వచ్చిందో దానిని సద్వినియోగం చేసుకోవడానికే ఎల్లప్పుడూ ప్రయత్నిస్తా. నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు శ్రీలంకలో జరిగే ముక్కోణపు టీ20 సిరిస్కు ఎంపిక అయ్యాననే వార్త విన్నాను' అని తెలిపాడు.
రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చిన నేపథ్యంలో రోహిత్ శర్మ నేతృత్వంలో యువ భారత జట్టు శ్రీలంకకు త్వరలోనే పయనం కానుంది. సెలక్టర్లు ఎంపిక చేసిన జట్టులో విజయ్ శంకర్తో పాటు తమిళనాడుకు చెందిన వాషింగ్టన్ సుందర్, సీనియర్ క్రికెటర్ దినేశ్ కార్తీక్లు కూడా చోటు దక్కించుకున్నారు.
'డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం తెలిసిందే, ముక్కోణపు టోర్నీకి ఎంపిక జట్టులోని సభ్యులు చాలా మంది ఇండియా-ఏ జట్టులో ఆడినవారే. తనతో పాటు వాషింగ్టన్ సుందర్, దినేశ్ కార్తీక్లు జట్టులో చోటు దక్కించుకోవడం ఆనందంగా ఉంది' అని విజయ్ శంకర్ అన్నాడు.
గతేడాది శ్రీలంకతో జరిగిన టెస్టు సిరిస్లో విజయ్ శంకర్ రెండు టెస్టుల్లో భారత్కు ప్రాతినిథ్యం వహించాడు. 'జాతీయ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నప్పుడు ఎంతో ఎంజాయ్ చేశా. మ్యాచ్లకు ఆటగాళ్లు ఎలా సన్నద్ధం అవుతారో అప్పుడే నేర్చుకున్నా. అప్పుడే నా బౌలింగ్లో కొత్త మెళకులను నేర్చుకున్నా' అని తెలిపాడు.
గత జనవరి 27,28 తేదీల్లో బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టు విజయ్ శంకర్ను రూ. 3.2 కోట్లకు కోనుగోలు చేసింది. తమిళనాడు వన్డే, టీ20 జట్టుకు కెప్టెన్గా ఉన్న విజయ్ శంకర్ ఈ ఏడాది గడిచిన సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హాజారే ట్రోఫీలో అద్భుతమైన ఫామ్ని ప్రదర్శించాడు.
విజయ్ హాజారే ట్రోఫీలో గుజరాత్తో జరిగిన మ్యాచ్లో సెంచరీతో పాటు మరో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. 'వ్యక్తిగతంగా విజయ్ హాజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మంచి ప్రదర్శన చేశా. ఆడే ప్రతిసారి అటు బౌలింగ్తో పాటు ఇటు బ్యాటింగ్లోనూ అద్భుత ప్రదర్శన చేయాలని భావిస్తా' అని విజయ్ శంకర్ తెలిపాడు.
జట్టు వివరాలు..:
రోహిత్శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సురేశ్ రైనా, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, విజయ్ శంకర్, శార్దూల్ ఠాకూర్, జయ్దేవ్ ఉనద్కత్, మహమ్మద్ సిరాజ్, రిషబ్ పంత్.