లండన్: ప్రపంచ కప్ టీ20 టోర్నీలో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో కీలక ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు విజయాన్ని అందించిన స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీకి ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా అభినందలు తెలిపాడు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరగనున్న సెమీఫైనల్ మ్యాచ్ను విరాట్ కోహ్లీ, విధ్వంసక బ్యాట్స్మన్ క్రిస్ గేల్ సమరంగా అభివర్ణించాడు.
టీ20 వరల్డ్ కప్ లో ఆదివారం భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ ముగిసిన తర్వాత తన అభిప్రాయాలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కోహ్లీకి అభినందనలు తెలిపాడు. సెమీ ఫైనల్లో విండీస్తో జరిగే మ్యాచులోనూ రాణించాలని ఆకాంక్షించాడు.
'అండర్-19 ఆటగాడిని ఉన్న కోహ్లీని ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టులోకి తీసుకున్నప్పుడు మాకు తెలియలేదు.. మేము తీసుకున్నది ప్రపంచలోనే బెస్ట్ బ్యాట్స్మన్ని అని. కంగ్రాట్స్. ముంబైలో జరగనున్న సెమీఫైనల్లో ఇద్దరు యోధులు క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ హోరాహోరీగా తలపడనున్నారు' అని విరాట్ కోహ్లీపై ప్రశంసలు గుప్పించారు మాల్యా.

విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం చేసి ఆదివారం జరిగిన మ్యాచులో ఆస్ట్రేలియాను చిత్తుచేసి టీమిండియాకు విజయాన్నందించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో ఇండియా సెమీస్ లోకి అడుగుపెట్టింది. దీంతో మార్చి 31 ముంబైలో వెస్టిండీస్తో భారత్ తలపడనుంది.
బ్యాంకులకు 9వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టిన విజయ్ మాల్యా ఇటీవల దేశం విడిచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన లండన్లో ఉన్నట్లు సమాచారం. అక్కట్నుంచే ట్విట్టర్ ద్వారా తన వ్యాఖ్యలు తెలియజేస్తున్నారు.