హైదరాబాద్: వయసు పెరుగుతున్న తన బ్యాటింగ్లో వాడి తగ్గలేదని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరోసారి నిరూపించాడు. విజయ్ హజారే టోర్నీలో భాగంగా బుధవారం విదర్భతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో తనదైన శైలిలో సిక్స్ కొట్టి జార్ఖండ్ను సెమీస్ చేర్చాడు.
ఈ మ్యాచ్లో ధోనీ కెప్టెన్సీలోని జార్ఖండ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 159 పరుగులే చేసింది. కెప్టెన్ ఫజల్ (2), జితేష్ శర్మ (7), సిద్దేశ్ (0), అంబటి రాయుడు (2) విఫలం కాగా, రవి (62) అర్ధ సెంచరీతో ఆదుకున్నాడు.
అనంతరం విదర్భ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ధోనీసేన 45.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జార్ఖండ్ జట్టులో ఇషాంక్ జగ్గీ(41), ఇషాన్(35) రాణించగా, ధోనీ 18 పరుగులతో అజేయంగా నిలిచాడు. చివర్లో ధోని సిక్సర్ కొట్టి మ్యాచ్ను ముగించాడు.
ధోని, ఇషాంక్ జగ్గీ (41 నాటౌట్; 4 ఫోర్లు, ఒక సిక్స్) ఐదో వికెట్కు అజేయంగా 49 పరుగులు జోడించారు. మరోవైపు బెంగాల్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో మహారాష్ట్రపై గెలిచింది. దీంతో జార్ఖండ్, బెంగాల్ జట్లు సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి. బెంగాల్తో జరిగిన మ్యాచ్లో తొలుత మహారాష్ట్ర ఆరు వికెట్లకు 318 పరుగులు చేసింది.
రాహుల్ త్రిపాఠి (95), నిఖిల్ నాయక్ (63) అర్ధ సెంచరీలతో రాణించడంతో మహారాష్ట్ర నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 318 పరుగులు చేసింది. అనంతరం శ్రీవత్స్ గోస్వామి (74), అనుస్తుప్ మజుందార్ (66), సుదీప్ చటర్జీ (60 నాటౌట్) అర్ధ సెంచరీలతో రాణించడంతో బెంగాల్ 6 వికెట్లు కోల్పోయి 49.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. మార్చి 17న జరిగే సెమీస్లో జార్ఖండ్, బెంగాల్ తలపడనున్నాయి.