సీనియర్ పేసర్ మహ్మద్ షమీ టీమిండియాలో పునరాగమనానికి సై అంటున్నాడు. తాజాగా తన ప్రదర్శనతో మరోసారి బీసీసీఐ సెలక్టరకు గట్టి సవాల్ విసిరాడు.
దాదాపు 14 నెలల నుంచి అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉన్న టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ రోజురోజుకూ మరింత ప్రమాదకరమైన బౌలర్గా మారిపోతున్నాడు. ఫిట్నెస్ను సాధించి ఛాంపియన్స్ ట్రోఫీకి నేను రెడీ అంటూ తన ప్రదర్శనతోనే బీసీసీఐ సెలక్టర్లకు గట్టి సవాల్ విసురుతున్నాడు. తనను కచ్చితంగా ఎంచుకుని తీరాల్సిందే అంటూ.. తన ఆటతీరుతో సెలక్టర్లకు గట్టి సందేశాన్ని పంపుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి తన అద్భుత ప్రదర్శనతో చెలరేగి ఆడాడు.

10 ఓవర్ల స్పెల్, 3 వికెట్లు, 61 పరుగులు -
నిన్నటి వరకు షమీ ఫిట్నెస్ పై ఎంతో కొంత ఆందోళన నెలకొనే ఉంది. కానీ ఇప్పుడు అది అమానుల్లో పూర్తిగా తొలిగిపోయే దిశగా వచ్చేసింది. ఎందుకంటే విజయ్ హజారే ట్రోఫీలో మళ్లీ అద్భుత ప్రదర్శనతో షమీ రెచ్చిపోయాడు. బెంగాల్ జట్టు తరఫున బరిలోకి దిగిన షమీ, హరియాణాతో జరిగిన మ్యాచ్లో మూడు వికెట్లు పడగొట్టాడు. పది ఓవర్ల స్పెల్ వేసిన అతడు 61 పరుగులు ఇచ్చాడు. అంతకుముందు రౌండ్ 7 మ్యాచ్లో కూడా మధ్యప్రదేశ్పై 42 పరుగులు చేసిన అతడు, ఎనిమిది ఓవర్లు బౌలింగ్ చేసి ఒక వికెట్ తీశాడు.
మరి తీసుకుంటారా?
టీమిండియా నెక్ట్స్ సొంతగడ్డపై ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. జనవరి 22 నుంచి ఐదు టీ20, మూడు వన్డేలు ఆడనుంది. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ బరిలో దిగనుంది. ఈ నేపథ్యంలోనే షమీ పది ఓవర్ల కోటాను ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేసి, తానూ రేసులో ఉన్నానని సెలక్టర్లకు గట్టి సందేశం పంపించాడు. ఒకవేళ అతడిని ముందుగా ఇంగ్లాండ్ తో జరగబోయే వన్డే సిరీస్ జట్టులోకి తీసుకుంటే, అక్కడ తానేంటో మరోసారి నిరూపించుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఐసీసీ టోర్నీలంటేనే షమీ రెచ్చి పోయి ఆడుతాడన్న సంగతి తెలిసిందే. గత వన్డే వరల్డ్ కప్ లోనూ అతడు తక్కువ మ్యాచ్లే ఆడినప్పటికీ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. చూడాలి మరి ఫిట్నెస్ విషయంలో మెరుగ్గా కనిపిస్తోన్న షమీని ఈ సారి ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తీసుకుంటారా? లేదా ? అనేది.
బుమ్రా విషయంలో సందిగ్ధం
మరోవైపు బుమ్రా కూడా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడటంపై సందిగ్ధం నెలకొంది. అతడికి మొదటగా 15 మందితో ప్రకటించే స్క్వాడ్లో ఛాన్స్ దక్కినా, ఫిట్నెస్ ఉంటేనే తుది జట్టులో ఆడిస్తామనే బీసీసీఐ షరతు విధించినట్లు ప్రచారం సాగుతోంది.