హైదరాబాద్: విజయ హాజారే ట్రోఫీలో భాగంగా టీమిండియా వెటరన్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మరోసారి సత్తా చాటాడు. దాదాపు రెండేళ్ల క్రితం టీమిండియా తరపున టెస్టు మ్యాచ్ ఆడిన గంభీర్.. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్కే పరిమితమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో గంభీర్ సూపర్ ఫామ్లో ఉన్నాడు.
ధావన్ ఔట్: మళ్లీ నాగిని డ్యాన్స్ చేసిన నజ్ముల్, వీడియో వైరల్
ఈ టోర్నీలో ఢిల్లీకి ప్రాతినిథ్య వహిస్తున్న గంభీర్ కేరళతో జరిగిన మ్యాచ్లో చెలరేగాడు. ఈ మ్యాచ్లో 104 బంతుల్లో 18 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 151 పరుగులు సాధించాడు. లిస్ట్-ఏ క్రికెట్లో గంభీర్కు ఇది 21వ సెంచరీ కావడం విశేషం. ఈ టోర్నీలో ఇప్పటికే గంభీర్ 298 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, హాఫ్ సెంచరీ ఉంది.
గ్రూప్-బిలో భాగంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ ఇన్నింగ్స్ను ఓపెనర్లు ఉన్ముక్త్ చంద్-గౌతం గంభీర్లు ఆరంభించారు. ఒకవైపు ఉన్ముక్త్ చంద్ నిలకడగా ఆడుతుంటే, గంభీర్ మాత్రం దూకుడుగా ఆడాడు. తొలుత హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గంభీర్ ఆ తర్వాత కేరళ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు.
ఈ క్రమంలోనే తొలి వికెట్ 172 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన గంభీర్, రెండో వికెట్కు 123 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన అనంతరం రిటైర్డ్ ఔట్గా వెనుదిరిగాడు. మిగతా ఢిల్లీ ఆటగాళ్లలో ఉన్ముక్త్ చంద్(69), ధృవ్ షోరే(99 నాటౌట్), విజయ్రన్(48 నాటౌట్)లు రాణించారు.
దీంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 392 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన కేరళ ఎనిమిది వికెట్ల నష్టానికి 227 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఈ మ్యాచ్లో ఢిల్లీ 165 పరుగుల తేడాతో విజయం సాధించింది.