
బెంగళూరు: బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా కర్ణాటక జట్టుతో జరుగుతున్న విజయ్హజారె ట్రోఫీ ఫైనల్లో తమిళనాడు జట్టు ఆలౌట్ అయింది. అభిమన్యు మిథున్ హ్యాట్రిక్ తీయడంతో 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌట్ అయి కర్ణాటక ముందు 253 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్ అభినవ్ ముకుంద్ (85), బాబా అపరజిత్ (66) అర్ధ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. భారత ఆటగాళ్లు మురళీ విజయ్, దినేష్ కార్తీక్, ఆర్ అశ్విన్ నిరాశపరిచారు. కర్ణాటక బౌలర్లలో అభిమన్యు మొత్తం 5 వికెట్లతో చెలరేగాడు. వి కౌశిక్ రెండు వికెట్లు తీశాడు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కర్ణాటక ఆదిలోనే తమిళనాడుకు భారీ షాక్ ఇచ్చింది. మొదటి ఓవర్లోనే ఓపెనర్ మురళీ విజయ్ (0)ని పేసర్ మిథున్ పెవిలియన్కు చేర్చాడు. మరో ఓపెనర్ అభినవ్ ముకుంద్ మాత్రం నిలకడగా ఆడాడు. అయితే వన్డౌన్లో వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ (8) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. దీంతో 24 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి తమిళనాడు జట్టు కష్టాల్లో పడింది.
ఈ దశలో క్రీజులోకి వచ్చిన అపరజిత్.. అభినవ్కు మంచి సహకారం అందించాడు. ఈ క్రమంలో అపరజిత్తో కలిసి అభినవ్ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. వీరిద్దరూ కలిసి సమన్వయంతో ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. కర్ణాటక బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ అభినవ్, అపరజిత్ అర్ధ సెంచరీలు చేశారు. 100కు పైగా భాగస్వామ్యం నెలకొల్పిన అనంతరం అభినవ్ పెవిలియన్ చేరగా.. మరోకొద్ది సేపటికే అపరజిత్ కూడా ఔట్ అయ్యాడు.
మరోసారి కష్టాల్లో పడ్డ జట్టును ధాటిగా ఆడుతూ విజయ్ శంకర్ (38) ఆదుకున్నాడు. అయితే భారీ షాట్ ఆడే క్రమంలో కెప్టెన్ దినేష్ కార్తీక్ (11), విజయ్ శంకర్ వెంటవెంటనే పెవిలియన్ చేరారు. ఇన్నింగ్స్ చివరలో షారుఖ్ ఖాన్ (27), మహ్మద్ (10) ధాటిగా ఆడారు. చివరి ఓవర్లో అభిమన్యు మిథున్ హ్యాట్రిక్ తీయడంతో తమిళనాడు జట్టు 252 పరుగులు చేసింది. టి నటరాజన్ (0) నాటౌట్గా నిలిచాడు.
చివరి ఓవర్లో అభిమన్యు వరుస మూడు బంతుల్లో షారుఖ్ ఖాన్, మహ్మద్, మురుగన్ అశ్విన్లను ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. దీంతో విజయ్ హజారె ట్రోఫీలో హ్యాట్రిక్ సాధించిన తొలి కర్ణాటక బౌలర్గా రికార్డులకెక్కాడు. రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ రెండింటిలోనూ హ్యాట్రిక్ సాధించిన రెండవ ఆటగాడిగా మిథున్ నిలిచాడు. మరోవైపు ఈ రోజు అభిమన్యు పుట్టినరోజు కావడం విశేషం.