కరుణ్ నాయర్.. ఈ పేరు గత కొద్ది రోజులుగా మార్మోగిపోతోంది. ఒకప్పుడు చెన్నైలో ఇంగ్లాండ్ పై ఏకంగా 303 ట్రిపుల్ సెంచరీ బాది క్రికెట్ ప్రియుల దృష్టిని ఆకర్షించిన అతడు ఆ తర్వాత కనమరుగైపోయాడు. 8ఏళ్ల నుంచి ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. మళ్లీ ఇప్పుడు దేశవాళీలో అదరగొడుతున్నాడు. త్వరలోనే జరగబోయే సిరీస్ల కోసం తనను పరిగణనలోకి తీసుకునేలా ప్రదర్శన చేస్తున్నాడు. ఈ ఏడాది టోర్నీలో అతడు ఐదు శతకాలు బాదాదు. టోర్నీ మొత్తంలో ఔట్ కాకుండా 600కు పైగా పరుగులు చేశాడు. దీంతో అతడిని ఇంగ్లాండ్ వన్డే సిరీస్ తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అలాగే ఫామ్ లోని కోహ్లీ, రోహిత్ ను పక్కనపెట్టాలన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ . కరుణ్ నాయర్ కు మద్దతుగా నిలిచాడు. బీసీసీఐ సెలక్షన్ కమిటీ తీరును తప్పుబట్టాడు. అతడిని త్వరలో జరగబోయే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేయాలని డిమాండ్ చేశాడు.

"ఎందుకు రూల్స్ అతడికి డిఫరెంట్ గా ఉన్నాయి. చాలా మంది జాతీయ జట్టుకు తమ ప్రదర్శన ఆధారంగా ఎంపిక అవుతారు. మరి ఎందుకు అతడికి రూల్స్ డిఫరెంట్ గా ఉన్నాయి? రోహిత్, విరాట్ ఫామ్ లో లేడని ప్రజలు అంటున్నారు. దీంతో మీరు వాళ్లను రంజీకి పంపిస్తున్నారు. మళ్లీ రంజీలో అద్భుతంగా ఆడి పరుగులు చేస్తున్నవారిని ఎందుకు పట్టించుకోవట్లేదు. వాళ్లు ఎప్పుడు ఆడతారు. వాళ్లు దేశవాళీలో పరుగులు చేస్తున్నారు కదా?"
"అసలు ట్రిపుల్ సెంచరీ చేసిన తర్వాత కూడా అతడిని ఎందుకు జట్టు నుంచి తప్పించారో నాకు అర్థం కావట్లేదు. ఎవరూ కూడా అలాంటి ప్లేయర్స్ గురించి మాట్లాడరు. అది నన్నెంతో బాధించింది. అప్పుడు అతడు మ్యాచ్ ఆడేందుకు జట్టుతో పాటు ఇంగ్లాండ్ వెళ్లాడు. కానీ అతడిని ఆడనివ్వలేదు. బహుశ ఐదో టెస్టులో అనుకుంటా, ఇండియా నుంచి ఆడేందుకు మరో ప్లేయర్ వెళ్లాడు. హనుమా విహారి అనుకుంటున్నాను. నాయర్ బదులు అతడు ఆడాడు. దీనికి కారణం ఏంటో నాకు చెప్పండి. అసలు ఇది కరెక్టేనా." అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు.