'డియర్ క్రికెట్, ప్లీజ్ ఇంకొక్క ఛాన్స్ ఇవ్వు' (2022లో) అంటూ.. అవకాశాలు లేక, తన క్రికెట్ కెరీర్ కు ఎండ్ కార్డ్ పడిపోతున్న సమయంలో అడుక్కున్న ఓ క్రికెటర్, ఇప్పుడు మళ్లీ తన విశ్వరూపం చూపిస్తూ మైదనంలో చెలరేగుతున్నాడు. కోహ్లీ, రోహిత్ టెస్ట్ కెరీర్ భవితవ్యం సందిగ్ధంలో పడిపోతున్న సందర్భంలో ఆ అవకాశాన్ని వినియోగించుకుని మళ్లీ జాతీయ జట్టులోకి చోటు సంపాదించుకోవాలనుకుంటున్నాడు. సెలక్టర్ల దృష్టి తనపై పడేలా చెలరేగి ఆడుతూ మైదానంలో వరుస సెంచరీలు బాదుతున్నాడు. అతడు మరెవరో కాదు కరుణ్ నాయర్.
కరుణ్ నాయర్ ఒకప్పుడు చెన్నైలో ఇంగ్లాండ్ పై ఐదో స్థానంలో బ్యాటింగ్ కు దిగి ఏకంగా 303 ట్రిపుల్ సెంచరీ బాది క్రికెట్ ప్రియుల దృష్టిని ఆకర్షించాడు. కానీ అప్పుడు లాంగెస్ట్ ఫార్మాట్ లో అతడిని టీమ్ ఇండియా పట్టించుకోలేదు. టెస్టుల్లోకి 2016లో అడుగుపెట్టిన అతడు... ఒక్క ఏడాదిలోనే ఇంగ్లాండ్ పై మూడు టెస్టులు, ఆస్ట్రేలియాతో మూడు టెస్టులు ఆడాడు. మొత్తంగా ఆరు టెస్టుల్లో 374 పరుగులు సాధించాడు. ఇందులోనే ట్రిపుల్ సెంచరీ ఉండటం విశేషం.

కానీ ఇతడి కెరీర్ సాగలేదు. ఈ ఘనత సాధించిన ఏడాది తర్వాత అతడికి జట్టులో స్థానం దక్కలేదు. ఎవ్వరూ అతడిని పట్టించుకోలేదు. అలా ఎనిమిదేళ్ల నుంచి ఇప్పటి వరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్లో ఆడే అవకాశం కూడా రాలేదు. కానీ, ఇప్పుడు దేశవాళీలో అదరగొడుతున్నాడు. సెలక్టర్ల దృష్టిని తనపై పడేటట్లు చేస్తున్నాడు. రాబోయే సిరీస్ల కోసం తనను పరిగణనలోకి తీసుకునేలా ఆడుతున్నాడు.
ఐదో సెంచరీ
తాజాగా జరిగిన విజయ్హజారే ట్రోఫీలో కరుణ్ నాయర్ (122 నాటౌట్; 82 బంతుల్లో 13×4, 5×6) తన ప్రదర్శనతో విదర్భ ను సెమీఫైనల్కు తీసుకెళ్లాడు. ఈ ఏడాది టోర్నీలో అతడు ఐదో శతకం బాదడం విశేషం. టోర్నీలో ఔట్ కాకుండా 600కు పైగా పరుగులు చేశాడు.
కోహ్లీ, రోహిత్ స్థానంలో
నాయర్.. దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తుండడంతో .. సెలక్టర్లపై బయట నుంచి ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రోహిత్, కోహ్లీ, గిల్ ఫామ్ లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి అతడిని ఎంపిక చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. చూడాలి మరి కరుణ్ నాయర్పై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో..
అందుకే అలా పెట్టా
రెండేళ్ల క్రితం నాయర్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ కావడం వల్ల దానిపై నాయర్ స్పందించాడు. అయితే, అది అప్పుడు భావోద్వేగంతో పెట్టిన పోస్ట్ అని చెప్పాడు. "6,7 నెలల పాటు ఎలాంటి క్రికెట్ ఆడలేదు. రోజూ మూడు గంటల పాటు జర్నీ చేసి ప్రాక్టీస్ మాత్రమే చేశా. అప్పుడు చాలా బాధపడ్డాను. కానీ, ఇప్పుడు వాటన్నింటిని పక్కనపెట్టి ముందుకువెళ్తున్నాను. ఏ అవకాశం వచ్చినా నేనెంటో నిరూపించుకోవడానికి సిద్ధమయ్యా" అని నాయర్ చెప్పుకొచ్చాడు.