
చెలరేగిన చోప్రా, నిఖిల్
తొలి క్వార్టర్ ఫైనల్లో హిమాచల్ ప్రదేశ్ బ్యాటర్లు ప్రశాంత్ చోప్రా, నిఖిల్ చెలరేగడంతో ఉత్తరప్రదేశ్పై ఆ జట్టు మరో 4.3 ఓవర్లు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన యూపీ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. రింక్ సింగ్ 76 పరుగులతో రాణించాడు. అతనికి తోడుగా భువనేశ్వర్(46), అక్షదీప్ నాథ్(32) పర్వాలేదనిపించే పరుగులు చేశాడు. హిమాచల్ ప్రదేశ్ బౌలర్లలో వినయ్ 3, సిద్ధార్థ్ శర్మ, పంకజ్ జైస్వాల్ రెండేసి వికెట్లు, రిషి ధావన్ ఒక వికెట్ తీశారు. అనంతరం హిమాచల్ ప్రదేశ్ 209 పరుగుల లక్ష్య చేధనలో ఆ జట్టు ఓపెనర్ ప్రశాంత్ చోప్రా 99 పరుగులు చేసిన తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. నిఖిలో 58 పరుగులతో రాణించాడు. దీంతో హిమాచల్ ప్రదేశ్ జట్టు మరో 4 ఓవర్లు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో గెలిచి సెమీస్లోకి అడుగుపెట్టింది. యూపీ బౌలర్లలో శివం మావి 3, అంకిత్ రాజ్పుత్ 2 వికెట్లు తీశారు. స్కోర్లు: ఉత్తరప్రదేశ్:207-9, హిమాచల్ ప్రదేశ్: 208-5.

సెంచరీతో చెలరేగిన జగదీశన్.. షారూక్ విధ్వంసం
రెండో క్వార్టర్ పైనల్లో కర్ణాటకపై ఘనవిజయం సాధించి తమిళనాడు విజయ్ హజారే ట్రోఫీ సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన తమిళనాడు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 354 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో జగదీశన్(102) సెంచరీతో చెలరేగగా షారూక్ ఖాన్(79*),
సాయి కిషోర్(61) హాఫ్ సెంచరీలతో రాణించారు. షారూక్ ఖాన్ అయితే 7 ఫోర్లు, 6 సిక్స్లతో 39 బంతుల్లోనే 79 పరుగులు చేసి అజేయంగా నిలిచి విధ్వంసం సృష్టించాడు. కార్తీక్(44) కూడా పర్వాలేదనిపించాడు. కర్ణాటక బౌలర్లలో ప్రవీణ్ దూబే 3, ప్రసిద్ 2, విజయ్ కుమార్, కరియప్ప చెరో వికెట్ తీశారు.

భారీ లక్ష్య చేధనలో చేతులెత్తేసిన కర్ణాటక
ఇక 355 పరుగుల భారీ లక్ష్య చేధనలో కర్ణాటక బ్యాటర్లు చేతులెత్తేశారు. ఏ ఒక్కరూ కనీసం 50 పరుగులు కూడా చేయలేకపోయారు. శ్రీనివాస్ శరత్(43), అభినవ్ మనోహర్(34) మాత్రమే పర్వాలేదనిపించే స్కోర్లు చేశారు. మిగతా వారెవరూ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేకపోయారు. దీంతో కర్ణాటక 39 ఓవర్లలో 203 పరుగులకే ఆలౌటైంది. తమిళనాడు బౌలర్లలో సిలంబరాసన్ 4 వికెట్లతో సత్తా చాటాడు. వాషింగ్టన్ సుందర్ 3, సిద్ధార్థ్, సందీప్, సాయి కిషోర్ తలో వికెట్ తీశారు. దీంతో కర్ణాటకపై 151 పరుగుల భారీ తేడాతో గెలిచి తమిళనాడు సెమీఫైనల్లో అడుగుపెట్టింది.
రేపటి మ్యాచ్లు
విజయ్ హజారే ట్రోఫిలో బుధవారం జరగనున్న మూడో క్వార్టర్ ఫైనల్లో విదర్భ, సౌరాష్ట్ర జట్లు తలపడనున్నాయి. అలాగే బుధవారమే జరగనున్న నాలుగో క్వార్టర్ ఫైనల్లో కేరళ, సర్వీసెస్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు మ్యాచ్లు ఉదయం 10 గంటలకే ప్రారంభం కానున్నాయి.


Click it and Unblock the Notifications












