హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్లో అతి పెద్ద సిక్సర్ రికార్డు బద్దలైంది. ఈ సీజన్లో ఇప్పటివరకు ధోనీ పేరిట ఉన్న ఈ రికార్డును రాయల్ చాలెంజర్స్ ఆటగాడు ట్రావిస్ హెడ్ అధిగమించాడు. ఆదివారం కోల్కతా నైట్రైడర్స్తో చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో హెడ్ ఈ భారీ సిక్సర్ బాదాడు.
ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు
అతడు కొట్టిన ఈ సిక్స్ ఏకంగా 109 మీటర్ల దూరం వెళ్లింది. ఇన్నింగ్స్ చివరి ఓవర్ నాలుగో బంతిని హెడ్ ఈ భారీ సిక్సర్గా మలిచాడు. అది ఫ్లడ్లైట్స్లోని ఒక స్తంభానికి తగిలి స్టాండ్స్లో పడింది. దీంతో ఐపీఎల్ పదో సీజన్లో అతి పెద్ద సిక్సు కొట్టిన ఘనత ట్రావిడ్ హెడ్ సాధించాడు.
ఇదిలా ఉంటే ఇదే స్టేడియంలో బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ధోని కొట్టిన సిక్స్ ఒకటి స్టేడియం రూఫ్పై పడిన సంగతి తెలిసిందే. ఇక ఆదివారం నాటి మ్యాచ్లో పంజాబ్ కీలక మ్యాచ్లో ఓటమి పాలైంది. జట్టు ఓపెనర్ హషీమ్ ఆమ్లా (60 బంతుల్లో 104; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీ చేసినా.. పేలవ బౌలింగ్, చెత్త ఫీల్డింగ్తో భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది.
దీంతో ఆదివారం మొహాలీలో జరిగిన లీగ్ మ్యాచ్లో గుజరాత్ లయన్స్ 6 వికెట్ల తేడాతో పంజాబ్పై విజయం సాధించింది. ముందుగా పంజాబ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 189 పరుగులు చేసింది. ఆమ్లా ఈ సీజన్లో రెండో సెంచరీ చేయగా, షాన్ మార్ష్ (43 బంతుల్లో 58; 6 ఫోర్లు) అద్భుత ప్రదర్శన చేశాడు.
అనంతరం 190 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 192 పరుగులు చేసింది. డ్వేన్ స్మిత్ (39 బంతుల్లో 74; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 29; 3 ఫోర్లు) తొలి వికెట్కు 91 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు.
పవర్ప్లేలో 58 పరుగులు చేసిన గుజరాత్ లయన్స్ 10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 103 పరుగులు చేసింది. 12వ ఓవర్లో డ్వేన్ స్మిత్ అవుట్ కావడంతో కెప్టెన్ రైనా (25 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్), దినేశ్ కార్తీక్ (23 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) చక్కటి ఇన్నింగ్స్ను ఆడి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించారు.
ఈ ఇద్దరూ మూడో వికెట్కు 42 పరుగులు జత చేశారు. ఆఖర్లో కాస్త ఉత్కంఠ నెలకొన్నా పంజాబ్ బౌలింగ్ అనుభవలేమిని అనుకూలంగా మార్చుకున్న కార్తీక్, జడేజా (7 నాటౌట్) ఐదో వికెట్కు అజేయంగా 27 పరుగులు జత చేసి జట్టును గెలిపించారు. డ్వేన్ స్మిత్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.