

హైదరాబాద్: ట్విట్టర్లో తనదైన శైలిలో ట్వీట్లు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకునే టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో మళ్లీ జోరందుకున్నాడు. ఐపీఎల్తో ముగిసిన తర్వాత కాస్త సమయం లభించడంతో ట్విట్టర్లో వరుసగా ఆసక్తికర ట్వీట్లతో రెచ్చిపోతున్నాడు.
తాజాగా శుక్రవారం సెహ్వాగ్ ట్వీట్ చేసిన ఓ ఆసక్తికర వీడియోను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. 'మనం అందరికీ సాయం చేయలేం.. కానీ, ప్రతిఒక్కరూ కొంత మందికి సాయం చేయవచ్చు' అంటూ కామెంట్ పెడుతూ సెహ్వాగ్ తన ట్విట్టర్లో ఓ వీడియోని పోస్టు చేశాడు.
'కంపాషన్ (దయాగుణం) జిందాబాద్' అనే యాష్ ట్యాగ్తో షేర్ చేసిన ఈ వీడియోలో ఓ రద్దీ రోడ్డుపై ఫుట్పాత్ అంచున ఓ అంధురాలు నిల్చొని ఉంది. రోడ్డు దాటేందుకు పలు మార్లు ప్రయత్నించి వెనకడుగు వేస్తోంది. ఏదో ఒక వాహనం రావడంతో మళ్లీ వెనక్కి వచ్చేస్తోంది. అదే సమయంలో అంధురాలికి సాయం చేయడానికి ఎవరూ ముందుకు రారు.
ఈ సమయంలో ఓ కోతి వచ్చి ఆమె చేతిలో ఉన్న కర్రను పట్టుకొని జాగ్రత్తగా రోడ్డు అవతలికి ఆమెను తీసుకెళ్లింది. ఆమెను సురక్షితంగా రోడ్డు దాటించిన కోతి తిరిగి వెనక్కి వెళ్లిపోయింది. తోటివారికి సాయం చేయాలనే సందేశం ఇస్తున్న ఈ వీడియో ప్రతి ఒక్కరి మనసుని కదిలించేలా ఉంది.