హైదరాబాద్: టీమిండియా అభిమానులు ఇప్పటివరకు ఎంత మంది వికెట్ కీపర్లను చూసి ఉండొచ్చు గాక, కానీ మహేంద్ర సింగ్ ధోని స్టయిలే వేరు. తాజాగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ధోనీ వికెట్ కీపింగ్లో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నాడు.
ఐపీఎల్లో భాగంగా ఆదివారం చిన్నసామి స్టేడియంలో బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఏబీ డివిలియర్స్ను పెవిలియన్కు పంపించిన తీరే అందుకు నిదర్శనం. 162 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 10.1 ఓవర్లకి 70/2తో మెరుగైన స్థితిలో కొనసాగుతోంది.
అప్పటికే కెప్టెన్ విరాట్ కోహ్లీ పెవిలియన్కు చేరినా... ఏబీ డివిలియర్స్ (29: 30 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సుల)తో నిలకడగా ఆడుతూ బెంగళూరును గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ సమయంలో ఏబీ డివిలియర్స్ను ధోని అవుట్ చేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది.
VIDEO: IN A FLASH! Absolute boss behind the stumps - @msdhoni https://t.co/zbwsVvySSg #IPL @RPSupergiants #RCBvRPS
— IndianPremierLeague (@IPL) 17 April 2017
బౌండరీ లైన్ చిన్నదిగా ఉండటంతో డివిలియర్స్ ఎక్కువగా క్రీజు నుంచి వెలుపలకి వెళ్లి భారీ షాట్లకు ప్రయత్నిస్తున్నాడు. దీన్ని గమనించిన ధోని.. సీనియర్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్తో చర్చలు జరిపి వ్యూహం రచించాడు. క్రీజుకు దూరంగా పదేపదే లెగ్సైడ్ బంతులేసిన తాహిర్ 11వ ఓవర్ రెండో బంతిని మాత్రం ఆఫ్సైడ్ వేశాడు.
అప్పటి వరకు లెగ్ వికెట్కి దగ్గరగా బంతులు వేస్తూ వచ్చిన తాహిర్.. ఒక్కసారిగా ఆఫ్స్టంప్ని లక్ష్యంగా చేసుకుని బంతిని విసిరాడు. అయితే బంతి గమనాన్ని తప్పుగా అర్థం చేసుకున్న డివిలియర్స్.. క్రీజు వదిలి షాట్ కోసం ప్రయత్నించాడు. దీంతో బంతి బ్యాట్కి అందకపోగా... నేరుగా వచ్చి ధోనీ చేతుల్లో పడింది.
ఇదే అదునుగా భావించిన ధోనీ.. క్షణాల వ్యవధిలోనే వికెట్లను గీరాటేశాడు. అప్పటికే స్టపింగ్ ప్రమాదం పసిగట్టిన డివిలియర్స్ క్రీజులోకి వచ్చేందుకు విశ్వ ప్రయత్నం చేసినా.. ఫలితం లేకపోయింది. ఈ వికెట్ చేజారడంతోనే బెంగళూరుపై ఒత్తిడి పెరిగి చివరికి 27 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.