
హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి రనౌటైన పాండ్యాపై మాజీ క్రికెటర్లు, అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అయితే పాండ్యా క్షమించరాని తప్పు చేశాడని కీలక వ్యాఖ్యలు చేశాడు.
కేప్టౌన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో కోహ్లీసేన ఓటమి పాలు కావడంతో మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో 0-1తో వెనుకబడింది. దీంతో సెంచూరియన్ టెస్టు కీలకంగా మారింది. ఈ మ్యాచ్లో గెలిస్తే సిరీస్పై ఆశలు సజీవంగా ఉంటాయి. లేదంటే టీమిండియా వరుస విజయాలకు దక్షిణాఫ్రికా బ్రేకలు వేసినట్లు అవుతుంది.
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య శనివారం (జనవరి 13)న రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 335 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్కు దిగిన టీమిండియా వరుస వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజులో ఉన్న కోహ్లీకి అండగా నిలిచే మరో బ్యాట్సమన్ కరువయ్యాడు.
రెండో టెస్టులో జట్టులోకి వచ్చిన పార్థివ్ పటేల్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. అలాంటి పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చి పాండ్యా.. కోహ్లీకి అండగా నిలుస్తాడని.. జట్టుకు ఆదుకుంటాడని చాలా మంది భారత అభిమానులు ఊహించుకున్నారు. అయితే పాండ్యా నిర్లక్ష్యంగా వ్యవహరించి వికెట్ సమర్పించుకున్నాడు.
అసలేం జరిగింది?
183/5 ఓవర్నైట్ స్కోరుతో మూడోరోజు ఆట ఆరంభించిన భారత్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రనౌట్ రూపంలో హార్దిక్ పాండ్యా (15) పెవిలియన్కు చేరాడు. రబడ వేసిన బంతిని స్టైట్గా ఆడిన పాండ్యా.. సింగిల్ కోసం ప్రయత్నించాడు. అయితే అవతలి ఎండ్లో ఉన్న కెప్టెన్ కోహ్లీ వెనక్కి వెళ్లాలని సూచించాడు.
అయితే వెంటనే వెనక్కి తిరిగిన పాండ్యా నెమ్మదిగా పరిగెత్తుతూ క్రీజులోకి చేరాడు. అయితే తన బ్యాట్ను ముందుగా క్రీజులో ఉంచలేదు. ఈ లోపల ఫిలాండర్ విసిరిన త్రో వికెట్లను గిరాటేసింది. బాల్ వికెట్లను తాకే సమయానికి పాండ్యా క్రీజులోకి వచ్చినప్పటికీ అతని కాలు, బ్యాటు గాల్లో ఉన్నాయి.
దీంతో థర్డ్ అంపైర్ ఔట్గా ప్రకటించారు. కోహ్లీ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. క్రీజులోకి చేరుకున్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే హార్ధిక్ పాండ్యా ఔటయ్యాడంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.