హైదరాబాద్: ఆస్ట్రేలియాలో జరిగిన ఓ దేశవాళీ టోర్నీలో క్రికెటర్లు మైదానంలో కొట్టుకున్నారు. యాకంద, ఎస్క్డేల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
యాకంద బౌలర్ వికెట్ తీసిన ఆనందంలో ఎస్క్డేల్ బ్యాట్స్మన్ వద్దకు వెళ్లి సంబరాలు చేసుకున్నాడు. దీంతో కోపంతో ఊగిపోయిన ఆ బ్యాట్స్మెన్ ఆ బౌలర్ను భుజంతో నెట్టి కింద పడేశాడు. దీంతో మరో ఫీల్డర్ వచ్చి బ్యాట్స్ మెన్పై దాడి చేశాడు.
క్రికెట్లో రెడ్కార్డ్: బ్యాట్ సైజుపై ఎంసీసీ కొత్త నిబంధనలివే
అంతేకాదు అతడిని కింద పడేసి అతడిపై చేసుకున్నాడు. ఇంతలో సహచర ఆటగాళ్లు అతడిని అడ్డుకున్నారు. మరోవైపు ఈ గొడవను ఆపడానికి అంపైర్ పరుగెత్తుకు రావడం వీడియోలో కనిపించింది. ఈ ఘటనపై ఆల్బరీ వొడొంగా క్రికెట్ టోర్నీ చీఫ్ మైకేల్ ఎర్డెలిజాక్ మాట్లాడారు.
తమ జట్లపై అభిమానం అందరికీ ఉంటుందనీ అయితే ఇది హద్దు మీరిన గొడవేనని విన్ న్యూస్ టెలివిజన్కు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనకు కారణమైన బౌలర్పై నాలుగు వారాలు, ఇక బ్యాట్స్మన్, ఫీల్డర్పై వచ్చే ఏడాది జనవరి వరకు సస్పెన్షన్ విధించారు.
అయితే గతవారంలో మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకోవడంపై దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలను అమలు చేయనున్నట్లు ఎంసీసీ వెల్లడించింది.
మైదానంలో దురుసుగా ప్రవర్తించే ఆటగాళ్లను రెడ్కార్డ్తో బయటకు పంపే అధికారం ఫుట్బాల్లో రిఫరీకి ఉంటుంది. అలాగే క్రికెట్లోనూ అంపైర్కు అలాంటి అధికారాలు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త కోడ్ ప్రకారం నాలుగు స్థాయిల్లో క్రికెటర్లకు జరిమానాలు విధించనున్నారు.