బీసీసీఐ మీడియా హక్కుల విషయంలో స్టార్ స్పోర్ట్స్కు వయాకామ్18 గట్టి షాక్ ఇచ్చింది. వచ్చే ఐదేళ్లకు సంబంధించిన మీడియా హక్కులను కైవసం చేసుకుంది. ఇంతకాలం భారత్ ఆడే మ్యాచులకు అధికారిక భాగస్వామిగా స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఉండేది. అయితే వచ్చే ఐదేళ్ల సైకిల్కు ఈ హక్కులను మాత్రం స్టార్ స్పోర్ట్స్ దక్కించుకోలేకపోయింది. ఏకంగా రూ.6 వేల కోట్లు ఖర్చు పెట్టిన వయాకామ్18.. ఈ హక్కులను దక్కించుకుంది.
ఇటీవలి కాలంలో ఈ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వయాకామ్18.. డిజిటల్, టెలివిజన్ రెండింటికీ సంబంధించిన బ్రాడ్కాస్ట్ హక్కులను తన ఖాతాలో వేసుకోవడం గమనార్హం. దీనికోసం వచ్చే ఐదేళ్లలో సుమారు రూ.6 వేల కోట్లను వయాకామ్18 చెల్లించనుందని తెలుస్తోంది. ఈ ఐదేళ్లలో జరిగే అన్ని వన్డే, టీ20, టెస్టు మ్యాచులను ఇదే సంస్థ బ్రాడ్కాస్ట్ చేయనుంది.

ఈ డీల్ తర్వాత భారత్ ఆడే అంతర్జాతీయ మ్యాచులు టీవీలో అయితే స్పోర్ట్ 18, స్పోర్ట్ 18 ఖేల్ ఛానల్స్లో వస్తాయి. అదే డిజిటల్ స్ట్రీమింగ్ అయితే జియోసినిమాలో వస్తుంది. ఈ ఏడాది నుంచి ఐపీఎల్ స్ట్రీమింగ్ హక్కులను కూడా జియోసినిమా దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీని వల్ల జియోసినిమా మార్కెట్ బాగా పెరిగింది. ఈ క్రమంలోనే ఐదేళ్ల బీసీసీఐ బ్రాడ్కాస్ట్ హక్కులను దక్కించుకోవడానికి వయాకామ్ గట్టిపోటీ ఇచ్చింది.
వీటి కోసం డిస్నీ స్టార్, సోనీ స్పోర్ట్స్, వయాకామ్18 మూడు కంపెనీలో గట్టిగా పోటీ పడ్డాయి. ఈ వేలంలో మిగతా రెండు కంపెనీలకు వయాకామ్18 షాకిచ్చింది. దీంతో 2023 నుంచి 2028 వరకు జరిగే మ్యాచులన్నీ ఈ కంపెనీనే బ్రాడ్కాస్ట్ చేయనుంది. ఈ హక్కులను రెండు వేరు వేరు ప్యాకేజీల్లో అమ్మాలని ముందుగా బీసీసీఐ అనుకుంది. భారత్లో టీవీ హక్కులను ప్యాకేజ్-ఏగా.. అలాగే మిగతా దేశాలతోపాటు డిజిటల్ స్ట్రీమింగ్ను ప్యాకేజ్-బీగా అమ్మాలని అనుకుంది.
దీనిలో ప్యాకేజ్-ఏలో ఒక్కో మ్యాచ్కు రూ.20 కోట్లు, ప్యాకేజ్-బీలో ఒక్కో మ్యాచ్కు రూ.25 కోట్ల బేస్ ధరను కూడా ఫిక్స్ చేశారు. ఈ ఐదేళ్ల కాలంలో మొత్తం 88 మ్యాచులు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. పరిస్థితిని బట్టి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతానికైతే భారత్లో జరిగే హోం గేమ్స్ ప్రసార హక్కులు స్టార్ స్పోర్ట్స్ వద్ద ఉన్నాయి. 2018లోనే ఏకంగా రూ.6138 కోట్లకు వీటిని స్టార్ స్పోర్ట్స్ దక్కించుకుంది.